హైదరాబాద్ : భారతదేశంలో ఆన్లైన్ చెల్లింపులకు రోజురోజుకూ వినియోగం పెరుగుతున్నది. డిజిటల్ చెల్లింపులు పెరుగుతుండడంతో ఆన్ లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వాట్సాప్ యాజమాన్యం నడుం బిగించింది. అందులో భాగంగా వాట్సాప్ హ్యాష్ ట్యాగ్ టేక్ చార్జ్ (WhatsApp #TakeCharge) పేరుతో వారం రోజుల పాటు వినియోగదారుల కోసం భద్రతా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆన్లైన్ భద్రత గురించి అవగాహన కల్పించడానికి, డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వినియోగదారులకు తెలియజేయనున్నది. ఇ-మెయిల్ లేదా మెసేజ్ ల రూపంలో ఫేక్ సమాచారం అందిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపిఐ) ప్రొవైడర్లు, బ్యాంకులు , ఇ-వాలెట్ ప్రొవైడర్ల నుంచి ఫోన్ కాల్స్ , వాయిస్ మెసేజ్ ల రూపంలో వచ్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి అవి నకిలీవిగా పరిగణించాలి. అంతేకాదు నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు సమస్యను పరిష్కరించినట్లు నటిస్తూ OTP లేదా UPI పిన్ వంటి సమాచారాన్ని కోరుతుంటారు. “కలెక్ట్ రిక్వెస్ట్” లింక్లు వినియోగదారులను క్యాష్బ్యాక్ లేదా లాటరీ ల పేరుతో కేవలం ఒకే ఒక్క క్లిక్తో ఆకర్షిస్తారు. ఇలాంటివి అసలు నమ్మకూడదు.
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నప్పుడు ఇవి తప్పనిసరి గా పాటించాలి..
ఖాతా నంబర్, లాగిన్ ID, పాస్వర్డ్, UPI-PIN, OTP, ATM పిన్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ అధికారులతో సహా, ఎవరు అడిగినా వాటిని ఎప్పుడూ షేర్ చేయవద్దు. మీ ఖాతా నుంచి డబ్బును తీయడానికి మాత్రమే UPI పిన్ ను వినియోగించాల్సి ఉంటుంది. నగదు డ్రా చేయడానికి UPI పిన్ అవసరం లేదు. డబ్బులు స్వీకరించడానికి QR కోడ్ని స్కాన్ చేయవద్దు. UPIలో మీరు చెల్లింపులు చేయడానికి QR కోడ్ని మాత్రమే స్కాన్ చేస్తారు.
UPI IDని ధృవీకరించేటప్పుడు రిసీవర్ పేరును తనిఖీ చేయండి. ధృవీకరణ లేకుండా చెల్లింపులు చేయవద్దు. స్పెల్లింగ్ లోపాల కోసం URLలు , డొమైన్ పేర్లను తనిఖీ చేయండి. డిజిటల్ లావాదేవీలు చేయడానికి ‘‘https’’తో ప్రారంభమయ్యే ధృవీకరించిన, సురక్షితమైన, విశ్వసనీయమైన వెబ్సైట్లను , యాప్లను మాత్రమే ఉపయోగించండి. అనుమానం ఉంటే, వెంటనే స్థానిక పోలీసులకులేదా సైబర్ క్రైమ్ టీమ్ కు తెలియజేయండి.