కీవ్, మార్చి 4: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో కీవ్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న భారతీయులను అక్కడి భారత ఎంబసీ ఏ మాత్రం పట్టించుకోలేదని దాడుల్లో గాయపడిన ఓ భారతీయ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం విద్యార్థులను నగరం నుంచి తరలించకుండానే, ఎంబసీ తమకంటే ముందు కీవ్ నుంచి ల్వీవ్కు తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చనిపోయాక, విమానాలను పంపిస్తే లాభమేంటని ప్రశ్నించాడు. ఢిల్లీ సమీపంలోని చత్తర్పూర్కి చెందిన హర్జోత్ సింగ్ కీవ్ను విడిచివస్తున్న క్రమంలో అతను ప్రయాణిస్తున్న క్యాబ్పై బుల్లెట్ల వర్షం కురిసింది. అతని చెయ్యి, చాతీ, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. గాయాలతో హర్జోత్ ప్రస్తుతం కీవ్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ‘దవాఖానలో ఉన్న నన్ను ఏ ఒక్క ఎంబసీ అధికారి కూడా సంప్రదించలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కీవ్లో తనలాంటి వాళ్లు అనేక మంది చిక్కుకుపోయారని, వాళ్లకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.