న్యూఢిల్లీ, నవంబర్ 29: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోకి వచ్చే రాష్ర్టాల్లో కాలుష్య నివారణకు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ చేసిన మార్గదర్శకాలకు ఏ మేర కట్టుబడి ఉన్నారన్నదానిపై స్పందన తెలుపాలని ఢిల్లీ, ఎన్సీఆర్ రాష్ర్టాలు, కేంద్రప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సెంట్రల్ విస్టా సహా తమ పరిధిలోని నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నివారణకు గాలి నాణ్యత కమిషన్ గతంలో మార్గదర్శకాలు జారీచేసింది. వీటి అమలుకు రాష్ర్టాలు ఏం చర్యలు తీసుకొన్నాయో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ‘కమిషన్ మార్గదర్శకాలు చాలా బాగున్నాయి. కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.