మాస్కో, ఫిబ్రవరి 23: ‘ఉక్రెయిన్ ఆక్రమణ’కు రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయని, ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభం అయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. పశ్చిమ దేశాలతో రష్యా ఎలాంటి లావాదేవీలు జరపకుండా రష్యా ఆర్థిక సంస్థలపై నిషేధం విధించారు. బైడెన్ ఆంక్షలను ప్రకటించిన గంటల వ్యవధిలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీడియో సందేశం ఇచ్చారు. ‘రష్యా భద్రతపై ఇక చర్చించేది ఏమీ లేదు’ అని తేల్చేశారు. శాంతి స్థాపనలో తనకు మిలిటరీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు.
మరోవైపు, ఉక్రెయిన్ తమ దేశంలో 30 రోజుల ఎమర్జెన్సీ విధించింది. అవసరమైతే రిజర్వ్ ఆర్మీని కూడా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. రష్యాలో ఉన్న ఉక్రెయిన్ పౌరులందరూ వెంటనే ఆ దేశాన్ని వదలిరావాలని ప్రకటించింది. రష్యా కూడా కీవ్లోని దౌత్య సిబ్బంది తరలింపు ప్రక్రియ చేపట్టింది. రష్యాలో 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు ఉంటారని అంచనా. రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్కు మద్దతుగా పశ్చిమ దేశాలు పలు ప్రకటనలు చేశాయి. ఉక్రెయిన్కు తమ సైన్యం మద్దతిస్తుందని యూకే ప్రకటించింది. యూకే సహా అనేక దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. ‘తూర్పు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకే రష్యా బలగాలు వెళ్తున్నాయి’ అన్న పుతిన్ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్’గా కొట్టిపారేశాయి. కాగా, ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
భద్రతా సంక్షోభం
ప్రపంచం ఇటీవల కాలంలో చూడని అతిపెద్ద భద్రత, శాంతి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. తూర్పు ఉక్రెయిన్లోకి బలగాలను పంపాలని పుతిన్ నిర్ణయించడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని పేర్కొన్నారు. రష్యా చర్చల్లేవని ప్రకటించడంతో ఆ విదేశాంగ మంత్రితో సమావేశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ వాయిదా వేసుకొన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో కొంతమంది మంగళవారం రాత్రి ఇండియా చేరుకొన్నారు.
ఉక్రెయిన్కు అత్యంత సమీపంలోకి రష్యా సేనలు
దక్షిణ బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా బలగాలు చేరుకున్నాయి. మాక్సర్ సంస్థ సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దక్షిణ బెలారస్లోని మెజ్యార్ ఎయిర్ఫీల్డ్ వద్ద 100కుపైగా మిలిటరీ వాహనాలు, డజన్ల కొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ విమానాశ్రయం ఉక్రెయిన్కు 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్బాస్లోకి రష్యా సేనలు చేరుకొన్నాయి. ఇక్కడ కాల్పుల్లో ఓ ఉక్రెయిన్ సైనికుడు చనిపోయినట్టు సమాచారం. రష్యా బలగాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు ఉక్రెయిన్ పౌరులు తుపాకులు చేతబట్టడానికి అనుమతించాలని ఉక్రెయిన్ యోచిస్తున్నది. దీనికి ఆ దేశ పార్లమెంటు అమోదం తెలుపాల్సి ఉంది.