నార్త్సౌండ్ (అంటిగ్వా): టాపార్డర్ విఫలమైనచోట కెప్టెన్ బ్రాత్వైట్ (311 బంతుల్లో 126; 13 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోవడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 354 పరుగులకు ఆలౌటైంది. కైల్ మయేర్స్ (49) ఫర్వాలేదనిపించగా.. బ్రాత్వైట్ ఒంటరి పోరాటం చేశాడు. లోయర్ ఆర్డర్లో ‘సింహబలుడు’ రకీమ్ కార్న్వాల్ (73; 10 ఫోర్లు, ఒక సిక్స్) ధనాధన్ షాట్లతో అలరించడంతో విండీస్ మంచి స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో సురంగ లక్మల్ 4, దుష్మంత చమీర 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం మంగళవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక కడపటి వార్తలందేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.