శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 18: శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో నెలకొల్పిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) శనివారం శాంతి కల్యాణం నిర్వహించనున్నట్టు త్రిదండి చినజీయర్స్వామి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన శ్రీరామనగర్లోని జీవప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. 108 ఆలయాల్లో భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున శాంతి కల్యాణం నిర్వహణలో కొంత ఆలస్యం జరిగినట్టు వివరించారు. శాంతి కల్యాణానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. సందర్శకులకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమతామూర్తిని దర్శించుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి రామానుజుల స్వర్ణమూర్తిని దర్శించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీరామానుజ స్వర్ణమూర్తి దర్శనంతో పాటు 108 దివ్యదేశాలలో నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, 3డీ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఈ టెక్నాలజీ ద్వారా చూస్తున్న దృశ్యానికి సంబంధించిన ఆడియో వినిపిస్తుందని తెలిపారు.