యాదాద్రి, డిసెంబర్1 : యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయ పునర్నిర్మాణ పనులు కనీవిని ఎరుగని రీతిలో కొనసాగుతున్నాయి. భక్తులకు ఏలోటూ లేకుండా కొండ కింద ఉత్తరదిక్కులో అన్ని వసతులు కల్పిస్తున్నారు. స్వామి వారికి తలనీలాల మొక్కు సమర్పించుకునే భక్తులకు లక్ష్మీపుష్కరిణి(గండిచెరువు) కింది భాగంలో ఆధునిక హంగులతో కల్యాణకట్ట నిర్మిస్తున్నారు. 2.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 20.25 కోట్లతో పనులు చేపట్టగా 80శాతం పూర్తయ్యాయి. కల్యాణ కట్ట ప్రధాన ద్వారం స్వాగత తోరణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా నెమలి, సింహాకృతులు, దేవతామూర్తుల ప్రతిమలతో తీర్చిదిద్దారు. ఒకేసారి 265 మంది తలనీలాలు సమర్పించుకునేలా.. స్నానాలకు వేడి, చలి నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదాద్రి, డిసెంబర్1: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం తరతరాలు నిలిచిపోవాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమవుతున్న ప్రధానాలయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆలయం ప్రారంభమైతే భక్తులు పోటెత్తే అవకాశాలున్నాయి. రోజుకు లక్ష మందికిపైగా స్వామివారిని దర్శించుకోనున్నారు. వచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు. ఇందుకోసం రూ. 20.25 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, పురుషులను ప్రత్యేకమైన హాల్స్ను నిర్మించారు. ఒకేసారి 265 మంది కూర్చునే విధంగా 9,222 చదరపు అడుగుల్లో పురుషులకు, 130 మందికి వీలుగా 4,763 చదరపు అడుగుల్లో మహిళలకు కల్యాణకట్ట ఫ్లాట్ ఫాంల నిర్మాణం పూర్తయ్యింది.
ప్రత్యేక గదులు..
స్వామివారికి తలనీలాలను సమర్పించుకునేందుకు వచ్చిన భక్తులకు కల్యాణకట్ట భవనంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పురుషులకు 20 స్నానాల గదులు, 30మూత్రశాలలు, వేడి నీళ్లు, దుస్తులు మార్చుకునేందుకు మరో 26గదులను నిర్మిస్తున్నారు. స్త్రీలకు 22 స్నానాల గదులు, 86 టాయిలెట్స్, వేడి నీటి సదుపాయం, బట్టలు మార్చుకునేందుకు 20గదులను నిర్మిస్తున్నారు. వీటితో పాటు బట్టలను భద్రపరిచేందుకు క్లాక్ రూం, కల్యాణ కట్ట టిక్కెట్లను విక్రయించేందుకు టోకెట్ కౌంటర్ రూంలతో పాటు, కల్యాణకట్ట పర్యవేక్షణాధికారికి ప్రత్యేకమైన గదులను నిర్మించారు. భక్తులకు సకల వసతులను కల్పించేందుకు ప్రత్యేకమైన లాబీలు, బ్యాగులను స్వీకరించే గదులు, ఎలక్ట్రికల్ రూం, సిబ్బందికి ప్రత్యేక గది, వెంట్రుకలు భద్రపరిచేందుకు ప్రత్యేకమైన రూంలను నిర్మించారు. భక్తుల స్నానాలకు ఇబ్బందులు లేకుండా లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి సంపును నిర్మించారు.