హైదరాబాద్ : సంపద సృష్టించాలి. దానిని పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. MCHRD లో మత్స్యకారుల జేఏసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు కనీస గుర్తింపు లేదు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో భారీగా మత్స్య సంపద పెరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 వేల చెరువులు ఉంటే..నేడు 23 వేలకు పెరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ప్రభుత్వం అర్హులైన ప్రతి మత్స్య కారుడుకి ప్రభుత్వ లబ్ధి పొందేలా సొసైటీలో సభ్యత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు.