హైదరాబాద్ : తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా మారి బలహీనపడిందని, తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయిందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నెల 11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల మోస్తారు వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా బోధన్లో 130 మిల్లీ మీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, కామారెడ్డి, జయశంకర్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.