నగరానికి ఉత్తరాన ఉన్న మేడ్చల్ ప్రాంతంలో ఐటీ కంపెనీలను విస్తరిస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.గ్రాడ్యుయేట్లకు సరైన ఉపాధి అవకాశాలు కలిగించేలా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కొంపల్లిలో టీ హబ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కండ్లకోయ జంక్షన్లో 6 లక్షల చదరపు అడుగుల ‘గేట్ వే’ ఐటీ పార్కు నిర్మాణానికి గురువారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైటెక్ సిటీలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సైబర్ టవర్ను ఏర్పాటు చేస్తే దాన్ని మించి కండ్లకోయలో 6 లక్షల 52 అడుగుల్లో ఐటీ టవర్ను నిర్మిసున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ, మేడ్చల్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మేయర్ జక్క వెంకట్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ హరీశ్, మున్సిపాలిటీ చైర్పర్సన్లు మద్దుల లక్ష్మీ రెడ్డి, మర్రి దీపికారెడ్డి, కైటీయా అధ్యక్షుడు ఓరుగంటి వెంకట్, ఐటీ సీఆర్వో అమర్నాథ్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి కమిషనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)/ మేడ్చల్ / మేడ్చల్ రూరల్ : మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా మరింత అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కండ్లకోయలో ఐటీ పార్కు శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఉత్తరం దిశలో 6 లక్షల 52 చదరపు అడుగులతో కండ్లకోయలో గేట్వే ఐటీ పార్కు ఏర్పాటు చేయడం మంచి పరిణామం. హైటెక్ సిటీలో నిర్మించిన సైబర్ టవర్ 5 లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తే దాన్నిమించి కండ్లకోయలో ఐటీ టవర్ నిర్మిసున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కొంపల్లి ప్రాంతంలో మహీంద్రా, మల్లారెడ్డి తదితర విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్నాయని, ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు అవసరమైతే ఈ ప్రాంతంలో టీ హబ్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ నవీన్కుమార్ రావు, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఐటీ, పరిశ్రమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహరెడ్డి, కలెక్టర్ హరీశ్, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్లు మద్దుల లక్ష్మీ రెడ్డి, మర్రి దీపికారెడ్డి, కైటీయా అధ్యక్షుడు ఒరుగంటి వెంకట్, ఐటీ సీఆర్వో అమర్నాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, ఎంపీపీ రజితారెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, గుండ్లపోచంపల్లి కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా అనుకున్న లక్ష్యం దిశగా సాగారని చెప్పారు. సహకార సంఘం చైర్మన్ ఎన్నికకు మొదటిసారిగా పోటీ చేసిన నాటి నుంచి తెలంగాణ సాధించే వరకు ఆయన ఎన్నో ఒడిదొడుకులు, అపజయాలను ఎదుర్కొన్నారని చెప్పారు. అయినప్పటికీ ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురికాకుండా 14 ఏండ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా శ్రమించి, తెలంగాణ సాధించారని అన్నారు. తెలంగాణ రావడం వల్లే నేడు ఇక్కడ ఐటీ పార్క్కు శంకుస్థాపన చేసుకోగలిగామని చెప్పారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని వివిధ పథకాలు, కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. భౌగోళికంగా 11వ స్థానం, జనాభాపరంగా 12స్థానంలో ఉన్న చిన్నరాష్ట్రం ఆదాయంలో 4వ స్థానంలో ఉండడం విశేషమని అన్నారు.
ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, ఎన్ని ఎదురుదెబ్బలు, ఒడిదొడుకులు వచ్చినా ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. యువతరం జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లి, విజయం సాధించనపుడే గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకుని పట్టుదలగా కష్టపడితే ఇది సాధ్యపడుతుందని చెప్పారు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఐటీ పార్కు శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్కు మేడ్చల్ జిల్లా నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ రైల్వేట్రాక్ నుంచి పార్కు వరకు వేలాది సంఖ్యలో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, బోనాలు, బతుకమ్మలు, కోయ, పోతురాజులు చేసిన విన్యాసాలతో మంత్రి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ వీక్షించారు.
మణికొండ, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజును పురస్కరించుకుని మణికొండకు చెందిన కేఎల్ గ్రూప్ అధినేత కొణతం లక్ష్మణ్గౌడ్ నిర్మించిన ‘వీరయోధ’ అనే పాటను గురువారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. వీరయోధ పాటలను విన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న సేవలను కండ్లకు కట్టినట్లుగా కొణతం లక్ష్మణ్ రూపొందించడం సంతోషాన్ని కలిగించదని చెప్పారు. ఈ పాటకు అభిజ్ఞ సాహిత్యాన్ని అందించగా, బుల్లెట్ బండి పాట ఫేమ్ ఎస్కే బాజీ సంగీతం, పార్టీ నేత పూర్ణ దర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో హైదరాబాద్లో ఐటీ విస్తరణ గురించి అనేక అనుమానాలు ఉండేవి. కొత్త ఐటీ కంపెనీలు వచ్చే సంగతేమో కానీ ఉన్న ఐటీ కంపెనీలు పోతాయేమోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసినం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో టీఎస్ఐపాస్ వంటి ఫ్రెండ్లీ పాలసీలతో వందల కంపెనీలను ఇక్కడికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించాం. ఐటీలో తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్న తపనలో భాగంగానే ఈ రోజు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి అతి పెద్ద సంస్థలు తమ క్యాంపస్లను హైదరాబాద్లోనే నిర్మించాయి. 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను ఇక్కడే ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న పాలసీలు దేశానికే ఓ బెంచ్మార్క్గా నిలుస్తున్నందున నగరానికి రోజుకో కంపెనీ వచ్చి పెట్టుబడి పెడుతున్నది
ప్రభుత్వ ఉద్యోగాలు మహా అయితే నాలుగైదు లక్షలు ఉంటాయి. కానీ ఏటా వచ్చే లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోగలిగేలా నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ఈ నెల 13నే ఉప్పల్ ప్రాంతంలో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెన్ప్యాక్ట్ ఐటీ కంపెనీకి శంకుస్థాపన చేశాం. దాని ద్వారా 15వేల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లన్నీ హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలోనే తయారవుతున్నాయి. ఆ ఐటీ, వ్యాక్సిన్ కంపెనీల్లో మన పిల్లలకూ ఉద్యోగాలు రావాలంటే ఆ మేరకు ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఉద్యోగాలు చేయడం మాత్రమే కాదు మీరే పది మందికి ఉద్యోగం ఇచ్చేలా ఎదగండి. ఆంట్రప్రెన్యూర్గా ఎదగాలనుకున్న ఔత్సాహికులకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది. అవసరమైతే కొంపల్లిలో కూడా మరో టీ హబ్ను నిర్మిస్తాం
– ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్