ఖైరతాబాద్, డిసెంబర్ 1: దేశంలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. వరి కొనుగోళ్లపై బీజేపీ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 18న చేపట్టే చలో ఢిల్లీ బ్రోచర్లను బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల చట్టాలతో 750 మంది రైతులు మరణించారని, వారి కుటుంబాలకు కేంద్రం రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు చిత్తశుద్ధి ఉంటే వడ్లు కొనాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎఫ్సీఐతో చెప్పించాలని నిలదీశారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ఎఫ్సీఐ ద్వారా కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. ఢిల్లీ కార్యక్రమం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామం, మండలం, జిల్లాల్లో ప్రచారాలు, దండోరాలు వేసి బీజేపీ వైఖరిని ఎండగడుతామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి తదితరులు పాల్గొన్నారు.