హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)158 కిలోమీటర్ల ఉత్తరభాగాన్ని 2025 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇందుకు రూ.7,512 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యుడు బీబీ పాటిల్ వేసిన ప్రశ్నకు గురువారం మంత్రి లోక్సభలో సమాధానమిచ్చారు. గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ ప్రకారమే దీనిని పూర్తిచేస్తామని చెప్పారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు తలపెట్టిన జాతీయ రహదారిలో భాగంగా ఖమ్మం నుంచి తంబూరు వరకు 105 కిలోమీటర్ల రోడ్డును 2024 ఏప్రిల్లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీనికి రూ.2,213.91 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. జుక్కల్ నుంచి దిన్నెదేవరపాడు వరకు 77.50 కిలో మీటర్ల జాతీయ రహదారిని 2024 సెప్టెంబర్లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. దీనికి రూ.1,965.32 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. నాగపూర్- విజయవాడ జాతీయ రహదారిలో భాగంగా మంచిర్యాల-వరంగల్- ఖమ్మం మీదుగా ఏపీ సరిహద్దు వరకు 311 కిలోమీటర్ల రోడ్డను 2025 మార్చిలోగా పూర్తి చేస్తామని వివరించారు. దీనికి రూ.6,700 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.