ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ‘ధురంధర్: ది రివెంజ్(ప్రతీకారం)’ వసూళ్లలో తమకూ వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారు! తమ ప్రాంతం ఇతివృత్తంగా సినిమా కథ నడుస్తుందని.. కాబట్టి తమ ప్రాంతంలో రోడ్లు వేయడానికి, అభివృద్ధి పనులకు ఆ సినిమా నిర్మాతలు డబ్బులు ఇవ్వాలన్నది వాళ్ల తర్కం! రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా ఉత్కంఠ రేపే గూఢచర్యం కథతో బాక్సాఫీసును బద్దలు కొడుతూ ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ చానల్ కంపారిజన్ టీవీ ల్యారీ వాసులను ఈ సినిమా సక్సెస్పై స్పందించాలని కోరింది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ తమ ప్రాంతం గురించి తీసిన సినిమా కాబట్టి దానికి వచ్చిన కలెక్షన్లతో 80 శాతం తమకే ఇవ్వాలని కోరారు. ‘ఆ సినిమాకు ఆదాయం ఇక్కడి నుంచే వచ్చింది కదా? ఇక్కడ రోడ్లు వేయడానికి ఆ డబ్బులో చాలా భాగం వాడాలి’ అని ఒకరు డిమాండ్ చేశారు. ల్యారీలోని ముఠాల నెట్వర్క్లోకి మారు వేషంలో చొరబడే భారత గూఢచారిగా ధురంధర్: ది రివెంజ్ చిత్రంలో రణవీర్ కనిపిస్తారు.