పంచభూతాల వల్లనే మానవుల అస్తిత్వానికి, సకల జీవజాలం మనుగడ సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) అన్నారు. ప్రకృతికి ప్రతిరూపాలైన నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం సకల జీవుల మనుగడకు ఆలంబనలు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా ప్రాణకోటి అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని…
ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం (World Earth day) సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
మన గ్రహంపై మదుపు అనే థీమ్ తో ఈ ఏడాది ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. భూ గ్రహాన్ని పునరుద్ధరించడానికి, ప్రపంచ పర్యావరణ వ్యవస్థలను పునర్నిర్మించడంపై మన వంతు కృషి చేయాలని ఈ థీమ్ సూచిస్తుందన్నారు. మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాలను, జీవనోపాధిని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి భూమాతను సంరక్షిద్దామని పిలుపునిచ్చారు.
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ (Telangana Haritha Haram) కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పరిశుభ్రత, పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్దరణ, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి లభ్యత పెరిగిందని, దీని వల్ల జీవవైవిధ్యం వృద్ధి చెందిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.