హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు వేర్వేరు సబ్కమిటీలు ఏర్పాటుచేశామని, నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రాజెక్టులను అప్పగించే విషయంపై తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు. గోదావరికి సంబంధించిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్లను తెలంగాణ మాత్రమే అందజేసిందని, కృష్ణా బేసిన్కు సంబంధించి రెండు రాష్ర్టాలు ఎలాంటి డీపీఆర్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. సీడ్ మనీని కూడా ఇప్పటివరకు జమచేయలేదని అన్నారు. అనుమతి లేని ప్రాజెక్టుల పనులన్నీ ఆపాలని రెండు తెలుగు రాష్ర్టాలకు రివర్బోర్డులు సూచించాయని చెప్పారు. సోమవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు షెకావత్ ఈ మేరకు సమాధానమిచ్చారు.