భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘వరి సాగుతో లాభం ఉండదు. అందుకే మాకున్న మూడెకరాల్లో జామ పంట, కూరగాయలు సాగు చేస్తున్నాం’ అని అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డకు చెందిన తండ్రీకొడుకులు. గ్రామానికి చెందిన నడికట్టు రోసిరెడ్డి, ఆయన కొడుకు రాజశేఖర్ కలిసి తమకున్న భూమిలో ఉమ్మడి సేద్యం చేస్తున్నారు. ఎకరంన్నర భూమిలో జామ, మరో ఎకరంన్నర భూమిలో పందిరి సాగు పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు. కరోనా తర్వాత జామకు డిమాండ్ పెరగటంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
పెట్టుబడి 30 వేలు.. ఆదాయం 80 వేలు
కరోనా తర్వాత పండ్ల వినియోగం పెరిగింది. దీంతో జామకూ డిమాండ్ పెరిగింది. జామ పంట ఏడాదిలో మూడుసార్లు కాస్తుంది. అంతర పంట వేసుకొనే వెసులుబాటు ఉన్నది. తైవాన్ లైట్ పింక్ కలర్ జామకు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్నది. మొక్కకు రూ.30 ఖర్చు అవుతుంది. మందులకు, సాగుబడికి కలిపి ఎకరంన్నరకు పెట్టుబడి రూ.30 వేలు అయింది. మూడు కాతలకు కలిపి రూ.80 వేల ఆదాయం వస్తుంది.
కూరగాయలతో నిత్యం ఆదాయమే
పందిరి పద్ధతిలో కూరగాయల సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా సాధించవచ్చు. ఆ విధానంతోనే ఈ తండ్రీకొడుకులు మరో ఎకరంన్నర భూమిలో కూరగాయలను పండిస్తున్నారు. బోడకాకర, పందిరి కాకర, సొర, బీరతోపాటు పందిరి మధ్యలో అంతర పంటలుగా ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రతి రోజు కూరగాయలు అమ్మడంతో చేతిలో డబ్బులు ఉంటున్నాయి. ముగ్గురు కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు.
జామలో అంతర పంటగా సీతాఫలం
తరచూ పంటలు మారుస్తుండాలి. ఆదాయం రావాలంటే అంతర పంటలు కూడా సాగు చేయాలి. జామలో అంతర పంటగా సీతాఫలం వేశాం. రిటైల్ రైతులు, వ్యాపారులు మా ఇంటికి వచ్చి కొంటున్నారు. కోతుల బెడద లేకుండా చూసుకుంటే చాలు. నేలను బట్టి పంటలను వేసుకోవాలి.