హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం నగరంలోని ఉప్పల్లో ‘JEET క్రికెట్ అకాడమిని’ ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాదరి కిషోర్తో కలసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులతో కలసి క్రికెట్ ఆడి వారిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, క్రీడాకారులకు, కోచ్ లకు ఈ పాలసీలో పెద్ద పీట వేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను వేగంగా పూర్తి చేస్తున్నామన్నాని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ను రూపొందిస్తున్నామని వివరాలను వెల్లడించారు.