కోల్కతా : బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై సైతం కేసు నమోదు చేశారు. కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ అయ్యింది. మే 29న సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కార్యాలయ గోడౌన్లోకి బలవంతంగా, అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకువెళ్లారు అని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.