పనాజీ: గోవాలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటన కొనసాగుతున్నది. ఒక్కరోజు పర్యటన కోసం ఇవాళ గోవాకు వెళ్లిన రాహుల్గాంధీ ముందుగా.. దక్షిణ గోవాలోని వల్సావో గ్రామంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పనాజీలోని అజాద్ మైదాన్ ఏరియాలోగల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ ట్యాక్సీ బైక్పై ప్రయాణం చేశారు ( Rahul Gandhi on Taxi bike ).
గోవాలో మోటార్ సైకిళ్లను అద్దెకిస్తుంటారు. పైలట్గా సుపరిచితమైన ఈ మోటార్ సైకిల్ ట్యాక్సీ సర్వీస్ నుంచి ఒక బైకును అద్దెకు తీసుకుని రాహుల్గాంధీ దానిపై ప్రయాణం చేశారు. ముందు ఒక వ్యక్తి బైకును నడుపుతుంటే రాహుల్గాంధీ అతని వెనుక కూర్చుని ప్రయాణించారు. ఇంతకూ ఆ ట్యాక్సీ బైకుపై ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారంటే గోవా రాజధాని పనాజీలోని బాంబోలిమ్ నుంచి అజాద్ మైదాన్ వరకు. ఆ తర్వాత అజాద్ మైదాన్లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు.