అంబర్పేట, ఫిబ్రవరి 24 : రైల్వేట్రాక్ల వెంట ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్న పాత దొంగను నల్లకుంట పోలీసులు రిమాండ్కు తరలించారు. అతని నుంచి రూ.2.25 లక్షల విలువైన 7.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నల్లకుంట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, డీఐ కిషన్తో కలిసి ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న తిలక్నగర్ రైల్వేట్రాక్ పక్కనే నివాసముంటున్న ఆదర్శ్కుమార్ తండ్రి ఇంట్లో 7.5 తులాల బంగారం చోరీ అయింది. ఘటనాస్థలంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా దొంగతనం చేసింది పాత దొంగ అనంతపురం జిల్లా కొండపల్లికి చెందిన తిమ్మసముద్రం శివగా గుర్తించారు. 9 ఏండ్ల వయసులోనే ఇంటిని వదిలిపెట్టిన శివ హైదరాబాద్కు వచ్చి డాన్ బాస్కో స్కూల్లో టైలరింగ్, డ్రైవింగ్, క్యాటరింగ్ నేర్చుకున్నాడు. దురలవాట్లకు దగ్గరై ఉద్యోగం చేయకుండా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తొలుత మ్యాన్హోళ్లపై ఉన్న కవర్లు, ఐరన్ రాడ్స్ చోరీ చేసేవాడు. అలా నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు (72 దొంగతనాలు) పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చి నల్లకుంట పీఎస్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డాడు. గురువారం శివను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన నల్లకుంట క్రైం బృందాన్ని అడిషనల్ డీసీపీ అభినందించారు.