నాడు సాగునీరు లేక సాగని ఎవుసం
పనుల్లేక పట్టణాలకు వృత్తిదారుల వలస
పొట్టకూటి కోసం అక్కడా నానా కష్టాలు
స్వరాష్ట్రంలో లింగాలఘనపురం సస్యశ్యామలం
ఊపిరిలూదిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు
గోదావరి జలాలతో నిండిన చెరువులు
గ్రామాలకు తిరిగివస్తున్న కుల వృత్తులవారు
మళ్లీ వాటా పంపకాలు మొదలు
నాడు..
ఊరంటేనే అన్ని కులాల సమ్మేళనం. వృత్తి పనుల్లో ఒకదానికొకటి విడదీయరాని అనుబంధం. గౌడన్నకు కుమ్మరి కుండ చేసిస్తే.. కమ్మరి కత్తికి పదునుపెట్టిస్తాడు. రజక, నాయీబ్రాహ్మణులు సేవ చేసి రైతుల వ్యవసాయ బావులను వంతులుగా పంచుకొని ధాన్యాన్ని ప్రతిఫలంగా తీసుకునేవారు. ఇలా కులవృత్తులన్నీ రైతు చక్రం కిందే జీవం పోసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేవి. కానీ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా సాగుకు నీరు లేక భూములు నెర్రెలుబారి వ్యవసాయం ముందుకుసాగక కులవృత్తులన్నీ చతికిలబడ్డాయి. కరువు ఛాయలు కమ్ముకుని పొట్టకూటి కోసం వలసలకు దారితీశాయి.
నేడు..
మిషన్ కాకతీయతో చెరువులు మరమ్మతులకు నోచుకొని గోదావరి జలాలతో కళకళలాడున్నాయి. భూగర్భ జలాలు పెరిగి.. ఇప్పుడు రెండు పంటలకూ నీరందుతుండడంతో సాగు పండుగలా మారింది. దీంతో వ్యవసాయంతో పెనవేసుకున్న కులవృత్తులకు తిరిగి జీవం పోసినట్లయింది. వలవ బాట పట్టిన వృత్తిదారులు సైతం పట్టణాల నుంచి సొంతూర్ల బాట పట్టారు. ఇప్పుడు అంతా ఒక్కచోట చేరి 30 ఏళ్ల క్రితం ఉన్న వాటాల పంపకాన్ని గ్రామ పెద్దల సమక్షంలో మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు.
ఒకప్పుడు కరువు పరిస్థితులతో చతికిలబడ్డ కులవృత్తులు స్వరాష్ట్రంలో జీవం పోసుకున్నాయి. 30 ఏండ్ల క్రితం ఉన్న ఊళ్లో ఉపాధి కరువై వలసపోయిన వృత్తిదారులకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంస్కరణలు, పథకాలు మళ్లీ పల్లెబాట పట్టేలా చేశాయి. ఉమ్మడి వరంగల్లో తీవ్రమైన కరువు ప్రాంతంగా పేరున్న జనగామ జిల్లాలోని లింగాలఘనపురం ఇప్పుడు సస్యశ్యామలమైన ప్రాంతంగా మారింది.
నాడు పనులు లేక వలస
లింగాలఘనపురం మండలంలోని అనేక మంది వృత్తిదారులు తీవ్రమైన కరువుతో పొట్టచేత పట్టుకొని పట్నం వలసపోయారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో పాటు భూములన్నీ నెర్రలు చూపి నీళ్ల కోసం ఆకాశం వైపు నోళ్లు తెరిచేవి. ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేయలేక కులవృత్తులకు ఆదరణ కరువైంది. అటు వ్యవసాయం చేయలేక ఇటు కులవృత్తిని నమ్ముకుని బతకలేక 60 నుంచి 70శాతం మంది పట్టణాల బాట పట్టారు.
గతమెంతో ఘనం..
ముఖ్యంగా కమ్మరి, కుమ్మరి, రజక, నాయీబ్రాహ్మణులు గ్రామాల్లోని రైతులకు ఉచితంగా సేవలందించేవారు. గ్రామాల్లోని రైతుల వ్యవసాయ బావులను ఆయా కార్మికులు వంతుల వారీగా(ఓటా) పంచుకునేవారు. ప్రతిఫలంగా ఆయా రైతులు పండించే ధాన్యం నుంచి ఏటా రెండు సార్లు రైతుకు వచ్చిన పంట దిగుబడి మేరకు బుడ్డెడు(8కిలోలు) కుంచెడు(రెండు బుడ్లు) తూమెడు(4బుడ్లు) ధాన్యం తీసుకునే వారు. అలాగే ఆయా రైతులు పండించిన నువ్వు, పెసర్లు, కందులు, బబ్బెర్లు తదిర పంటల దిగుబడి నుండి నుంచి తీసుకుని సేవలనందిస్తూ.. అటు వారికున్న భూమిని సేద్యం చేస్తూ బతికేవారు. పండుగలు, పబ్బాలప్పుడు, శుభ.. అశుభ కార్యక్రమాలప్పుడు సేవలందించి ప్రత్యేకంగా బహుమతి రూపంలో తీసుకునేవారు.
స్వరాష్ట్రంలో సస్యశ్యామలం..
కరువుతో అల్లాడిన ప్రాంతం.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చలవతో సస్యశ్యామలమైంది. వ్యవసాయం కోసం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఊపిరిలూదినట్లయింది. ముఖ్యంగా మిషన్ కాకతీయతో అన్ని గ్రామాల్లోని చెరువులు మరమ్మతులకు నోచుకున్నాయి. ఆ చెరువులనన్నింటినీ గోదావరి జలాలతో నింపడంతో సాగునీటికి ఇబ్బందుల్లేకుండా అయింది. ఇప్పుడు రెండు పంటలకు నీరందుతోంది. భూగర్భ జలాల మట్టం పెరుగడంతో లింగాలఘనపురం మండలంలో రెండేళ్ల నుంచి సాగు విస్తీర్ణం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో గ్రామాల్లో ఉన్న(ఓటా) వాటాలను గ్రామాల్లో విధి లేక కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారికి అప్పగించి వలస వెళ్లిన నాయీబ్రాహ్మణులు, రజకులు, కమ్మరి, కుమ్మరి కులస్ధులు గ్రామాల్లోకి చేరుతున్నారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఓటాల(వాటాల) పంపకానికి గ్రామ పెద్దల సమక్షంలో కొత్తగా పంచుకుంటున్నారు. కులవృత్తులు గ్రామాల్లోకి తిరిగి వస్తుండడంతో పూర్వవైభవం సంతరించుకుంది. ఇలా అన్ని వలససోయిన కులాల వారు తిరిగి గ్రామాలకు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాత రోజులు వచ్చినట్లుంది..
పండగలప్పుడు, పబ్బాలప్పుడు.. శుభ అశుభ కార్యాలప్పుడు ఉచితంగా కుండలు అందించి పంటలు పండిన తర్వాత పంటలను తీసుకుని సేవలందించేవాళ్లం. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది పండగలప్పుడు కుండలను సరఫరా చేసేవాళ్లం. మా కులస్తులంతా కరువుతో వలసపోవడం వల్ల కుండలు చేసే భారమంతా ఇక్కడ ఉన్న ఒకటీ అర కుటుంబాలపై పడింది. వలసపోయిన వాళ్లు గ్రామాల్లోకి మళ్లీ వస్తుండడంతో పాత రోజులు వచ్చినట్లు అనిపిస్తోంది. గ్రామాల్లో మా సంఖ్య పెరుగుతుండడం సంతోషంగా ఉంది. – జాగిళ్లపురం అబ్బులు, శాతవాహన సంఘం నాయకుడు
చెరువులు నిండడంతో మళ్లీ వస్తున్నారు
కరువు తీవ్రంగా ఉండడం వల్ల చాలామంది నాయీ బ్రాహ్మణులు తప్పని పరిస్థితుల్లో పట్టణాలకు వలసపోయిన్రు. ఇప్పుడు చెరువులన్నీ గోదావరి నీటితో నిండుగ ఉన్నయ్. అటు వ్యవసాయమే కాదు.. కులవృత్తులకు మంచిరోజులు వచ్చాయి. అందుకే ఇప్పుడు వాళ్లంతా ఊళ్ల వైపు వస్తున్నరు. – లింగాల సత్యం, కళ్లెం
మళ్లీ 30 ఏండ్లకు వాటాలేసుకుంటున్నం..
40 ఏళ్ల క్రితం రజకులు ఊళ్లళ్ల వాటాలు పంచుకుని సేవ చేసేది. చాలామంది వాళ్ల వాటాలను వేరే వాళ్లకు అప్పజెప్పి 30 ఏళ్ల కింద వలసపోయిన్రు. ఇప్పుడు మస్తు నీళ్లు వత్తానయ్. బొచ్చెడు పని దొరుకుతాంది. అందుకే నాడు పోయినోళ్లు మళ్లీ ఊళ్లకు వత్తాన్రు. ముప్పై ఏండ్లకు మళ్లీ కొత్తగా వాటాలు పంచుకుంటున్నం.