‘తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించనైనది..’ ఇలా రైతుల కోసం ప్రతి ఊరూ కదిలి వస్తున్నది. వడ్లు కొనాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఎంపీపీలు, సర్పంచ్ల అధ్యక్షతన శనివారం మండల పరిషత్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం ధాన్యం కొనాలని తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి కొరియర్, పోస్టుల్లో పంపారు. నేటి నుంచి జిల్లా పరిషత్లలోనూ తీర్మానాలు చేయనుండగా కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యలపై రెండోరోజూ ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, ప్రజలు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు.
వరంగల్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను కొనుగోలు చేయాలనే డిమాండ్తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. శనివారం ఎంపీపీలు, సర్పంచ్ల అధ్యక్షతన జరిగిన పలు మండల ప్రజాపరిషత్లు, గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాలకవర్గాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించాయి. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని తీర్మానాలను ఆమోదించాయి.
పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రైతుల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఉద్యమించాలని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శాసనసభ నియోజకవర్గాల వారీగా కార్యాచరణకు సన్నాహక సమావేశాలు జరిగాయి. రాష్ట్ర మంత్రులు, నిరసన కార్యక్రమం ఇన్చార్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, ఓడీసీఎంఎస్, మున్సిపల్, పీఏసీఎస్ చైర్మన్లతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈనెల 31వ తేదీ వరకు గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్లు, మున్సిపాలిటీలు, పీఏసీఎస్లు, డీసీసీబీ, ఓడీసీఎంఎస్, జిల్లా ప్రజాపరిషత్ల సమావేశాలు నిర్వహించి తెలంగాణ రైతులపై కేంద్రం వైఖరిని ఖండిస్తూ వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్తో తీర్మానాలు ఆమోదించి ప్రధాని మోదీకి పంపాలని చెప్పారు.
ఈ మేరకు జిల్లాలో శుక్రవారం నుంచి స్థానికసంస్థల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ మొదలైంది. సర్పంచ్లు, ఎంపీపీలు, మున్సిపల్, పీఏసీఎస్ల చైర్మన్ల అధ్యక్షతన తీర్మానాల ఆమోదం కొనసాగుతున్నది. శనివారం ఖానాపురం, నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండి, నెక్కొండ, సంగెం, రాయపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు జరిగాయి. సర్పంచ్లతోపాటు వార్డు సభ్యులు సమావేశాలకు హాజరై కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్రం వడ్లు కొనేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండని వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. గోయల్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను మానసిక క్షోభకు గురిచేశాయని ధ్వజమెత్తారు. ఖానాపురం ఎంపీపీ వీ ప్రకాశ్రావు గ్రామ పంచాయతీల సమావేశాలకు హాజరై వడ్ల కొనుగోలుపై కేంద్రం తీరును తూర్పారపట్టారు.
పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ రైతుల నుంచి రెండు పంటలను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. దుగ్గొండి, సంగెం మండల ప్రజాపరిషత్ల పాలకవర్గం ప్రత్యేక సమావేశాలు కూడా జరిగాయి. ఎంపీపీలు కోమల, కళావతి అధ్యక్షత వహించిన ఈ సమావేశాలకు ఎంపీటీసీలు హాజరై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుందనటం అహంకారమని, తెలంగాణ ప్రజలను కించపరచడమేనని ఎంపీపీలు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్ల ప్రత్యేక సమావేశాలు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించాయి.
పంజాబ్లో ఏటా రెండు పంటలు (వడ్లు, గోధుమలు) వంద శాతం ఎఫ్సీఐ ద్వారా కేంద్రమే కొంటున్నట్లు తెలంగాణలోనూ వానాకాలం, యాసంగి వడ్లను కొనాలనేది తీర్మానాల సారాంశం. ఈ తీర్మానాల ప్రతులను గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్లు కొరియర్, పోస్టు ద్వారా ప్రధాని మోదీకి పంపాయి. తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనాలనే వివిధ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. వర్ధన్నపేటలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎంపీపీ అప్పారావు బీజేపీ తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. నూకలు తినటం అలవాటు చేయండన్న కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.