‘రేషన్ షాపులకు అప్పట్ల ముక్కిపోయిన పంజాబ్ బియ్యం పంపేటోళ్లు.. దొడ్డుకు దొడ్డు.. అండ్ల మట్టి పెళ్లలు, రాళ్లు, ఎల్క గొత్కెలు ఉండేటియి.. గివేం బియ్యం అంటె పంజాబ్ నుంచి వచ్చినయ్ అనేటోళ్లు.. ఇప్పుడు తెలంగాణ వడ్లు కొనకుండ పంజాబ్ బియ్యాన్నే రేషన్ దుకాణాలకు పంపాలని సూత్తున్నరేమో’ నని రైతులు, వివిధ వర్గాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ధాన్యం కొనాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం కిరికిరి పెట్టుడు వెనుక మత్లబ్ ఇదేనేమోనని సందేహపడుతున్నరు. ‘మేం పండించిన వడ్లు కొనాలని కోరితే రకారకాల కొర్రీలు పెడుతూ చర్చలకు వెళ్లిన తెలంగాణ మంత్రులను, రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తారా? అంటూ మండిపడుతున్నరు. గతంలోనూ ‘ఊరికే ఢిల్లీకి ఎందుకు వస్తరు?.. మీకేం పనుల్లేవా’ అని తెలంగాణ మంత్రులను కేంద్ర పౌరసరఫరాల మంత్రి పీయూష్ గోయల్ అవమానించారని, ఇప్పుడు ‘మీ ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయండి’ అని హేళన చేశారని, ఇది ముమ్మాటికీ తెలంగాణపై కంటగింపేనని తెగేసి చెబుతున్నరు. – హనుమకొండ సబర్బన్, మార్చి, 26
రేషన్ షాపుల్లో అవే అంటగడ్తరేమో!
తెలంగాణలో యాసంగిలో పండించే ధాన్యం నూక అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతూనే ఉంది. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామని ఎన్నిసార్లు మొత్తుకున్నా కేంద్రం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరిస్తున్నది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కేంద్ర సర్కారుకు కంటగింపుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో కీలక భూమిక పోషించే వారంతా ఉత్తరభారతం వారే ఉండడంతో వారికి దక్షిణభారతం నుంచి ఓ రాష్ట్రం ఆర్థికంగా బలపడడం ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు గరంగరమవుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేంద్రం తీరుకు ఎదురు తిరగలేక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడో మాట, అక్కడో మాట మాట్లాడుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దని రైతులకు సూచిస్తే ‘బాజాప్తా వరి వేయండి.. మీ వడ్లను మేం కొనిపిస్తాం’ అని బీరాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎటు పోయిండని నిలదీస్తున్నారు. మొన్నటికి మొన్న బండి సంజయ్ ఢిల్లీలో కేంద్రం కొంటుందని ప్రకటించారని, ఆ మరునాడే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ధాన్యాన్ని తీసుకునే ప్రసక్తి లేదని ప్రకటించారని ఇలా బీజేపీ ద్వంద్వ వైఖరితో రైతులను ఆగం చేస్తున్నారని మండిపడుతున్నారు.
అన్నింట్లోనూ వివక్షే
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై మొదటి నుంచీ వివక్ష చూపుతున్నది. ధాన్యం, ఇతర సమస్యలపై రాష్ట్ర బృందాలు ఎన్ని సార్లు ప్రధాన మంత్రిని అపాయింట్మెంటు అడిగినా తిరస్కరించారు. పైగా రాష్ట్ర ప్రతినిధులను ‘మీకు తెలంగాణలో ఏం పని లేదా..? ఎందుకు మాటిమాటికీ ఢిల్లీకి వస్తున్నారు’ అని ప్రశ్నించి అవమానించారు. తెలంగాణలో చేపట్టిన అనేక పథకాల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కేంద్రం గుర్తించలేదు. ఇంటింటికీ మంచి నీళ్లు అందించే మిషన్ భగీరథ పథకం బాగుందని కితాబునిచ్చి ఊరుకుందే తప్ప ఒక్క రూపాయీ ఇవ్వ లేదు. విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేంద్రం బడ్జెట్లో రాష్ర్టానికి ఎందులోనూ ప్రాధాన్యం దక్కలేదు. ఇప్పుడేమో ఏకంగా తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని అవమాన పరిచేలా ‘మీ ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయండి’ అని కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు ఈసడించుకుంటున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో మీకు నూకలు తినిపిస్తమో, బువ్వ తినిపిస్తమో సూపెడ్తం బిడ్డా’ అంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో ఇచ్చినట్లు ముక్కిపోయిన పంజాబ్ బియ్యాన్ని రేషన్ షాపులకు పంపుతారో ఏమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
ఆయన తింటే మేం కూడా తింటం
కేంద్ర మంత్రి ఒకాయన మమ్ములను నూకలు తినుండ్లని అన్నడట. మేం ఆరుగాలం కట్టపడి వందల మందికి తిండి పెడుతున్నం. నీకు అక్కడ ఏ కాయ కట్టం లేనట్టుంది. నువ్వు అచ్చి ఎవుసం జేత్తువురా. ముందుగాల నువ్వు నూకల బువ్వ తిను అటెన్క మేం తింటం. మేం ఇక్కడ వడ్లు పండియ్యకుంటే అక్కడున్న మంత్రులందరికీ నూకల బువ్వే దిక్కయితది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఎవుసం కోసం ఎన్నో పనులు సేత్తున్నడు. ఆయినెను సూసి మీరు కూడా ఇంకా ఎక్కువ మంచి పనులు శేసి సూపెట్టున్లి. గంతేకని ఉరికెటోళ్ల కాళ్లల్ల కాట్టెలు పెట్టి పడెయ్యకున్రి. గాక్కడెక్కన్నో పంజాబ్ల ఉన్నోళ్లే రైతులా మేం గాదా. మమ్ముల ఓ తీరుగ, ఆల్లను ఓ తీరుగ జూత్తరా?. మీరు బాజాప్తా మా వడ్లు కొంటేనే సరి.. లేదంటే వచ్చే ఎలక్షన్ల మీ సంగతి ఎట్ల జెప్పాల్నో మాకు మా ఎరుకే.
– గూడెపు సమ్మయ్య, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ సబర్బన్
మళ్ల పంజాబ్ బియ్యం ఇస్తరేమో!
నాకు 70 ఏండ్ల దాక ఉంటయ్. ఒకప్పుడు పజ్జొన్న, మక్క జొన్న గడ్క తిని బతికినం. ఒక్కో పూట గంజి తాగినం. కొన్రోజులు నూకల బువ్వ తిన్నం. పడరాని పాట్లు పడ్డం. ఆనాడు ఒక్కడు మా దిక్కు సూసినోళ్లు లేరు. మా కేసీఆర్ దయవల్ల ఇప్పుడు 24 గంటల కరంటస్తాంది. నడి ఎండల్ల చెరువులు, కుంటలు నిండుగున్నయ్. కాలువల్ల బొచ్చెడు నీళ్లు పారుతున్నయ్. గుంట భూమి సుత ఇడిసి పెట్టకుంట దున్ని నాటేసిన. వడ్లు మస్తు పండుతున్నయ్. గడ్క, నూకలు తినే రోజులు పోయి కడుపునిండ సన్నబియ్యం తినే రోజులు వచ్చినయ్. మా కోపన్ దుకాణంల పది, పదిహేనేండ్ల కిందట ముక్కిపోయిన బియ్యం ఇచ్చేటోళ్లు. గివేం బియ్యం అని అడిగితే ఇవి పంజాబ్ నుంచి వచ్చినయనేటోళ్లు. ఇప్పుడు సుత రేషన్ దుకాణాలకు పంజాబ్ బియ్యం పంపుదామని సూత్తున్నరేమో.. ఇప్పుడైతే మాకు దుకాన్లల్ల మంచి సన్నబియ్యం ఇత్తాన్లు. గింత మంచిగ బతుకుతున్నమమ్ములను నూకలు తినుమంటె తింటమా, నీకే తినిపిత్తం బిడ్డా.
– కడారి అయిలయ్య, ఎల్కతుర్తి, హనుమకొండ సబర్బన్
సెంట్రలోళ్ల తీరు మంచిగ లేదు
గా సెంట్రలోల్ల తీరు ఏం మంచిగ లేదు. మేం పండించిన వడ్లను లెక్క ప్రకారం అందరి దగ్గర కొన్నట్లు కొనుమంటే కేంద్ర మంత్రి మతి లేని మాటలు మాట్లడుడు మంచిది కాదు. ఇదైతె తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించే తీరుగనే ఉన్నది. ఆయినెకు గంత మిడిసిపాటు ఉండద్దు. నువ్వు కొంటవా? కొనవా? సక్కగ జెప్పక మీ ప్రజలకు నూకలు తినుడు సురువు జెయ్యిన్లి అని చెప్పుడేంది. మా కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఎన్నో సేత్తాన్లు. దాంట్లో పావుల మందం చేసినా మీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకుంటం. పనులు చేసుడు శాతగాదుగని మాటలు దొబ్బుడు మస్తుగ వస్తయ్. మీరు వడ్లు పండియ్యిన్లి నేను కొనిపిస్తనన్న బండి సంజయ్ గిప్పుడు ఏడున్నడో తెల్తలేదు. మా రైతులమంత ఒక్కతాటిమీదికస్తం. అప్పుడు ఆ సెంట్రలోల్ల సంగతి తేల్తది.
-పుల్ల చేరాలు, కమలాపూర్
రైతును అవమానిస్తే పుట్టగతులుండవ్
దేవరుప్పుల, మార్చి 26 : దేశానికి అన్నంపెట్టే రైతును అవమానించిన ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిందిపోయి సవతి తల్లి ప్రేమ చూపడం బీజేపీకే చెల్లుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్ష వల్ల కలోగంజో తాగి బతికినం. ఇక స్వరాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయంలో స్వయంసమృద్ధి సాధించాం. ఇప్పుడు మాకు నూకలు తినాల్సిన అవసరం లేదు. దేశానికి కరువు వస్తే తిండి గింజలు పంపే స్థితిలో మేమున్నాం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మమ్మల్ని నూకలు తినమని అవమానించాడు. ఆ మాటలకు మిత్తితో పాటు బదులిస్తాం. కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోంది. దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కేంద్రం. రైతులు పండించిన ఏ ధాన్యాన్నైనా కొనాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుంది. ఇప్పటికైనా రైతులు రోడ్లెక్కి బీజేపీపై తిరుగుబాటు చేయకముందే ధాన్యం కొంటామని ప్రకటన చేయాలి.
– గుగులోత్ కోక్యానాయక్, రైతు, సర్పంచ్, పడమటితండా