కరీమాబాద్, మార్చి 26: పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకే పని చేస్తున్నారని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటలక్ష్మి హెచ్చరించారు. మామునూరు సీఐ బానోత్ రమేశ్ ఆధ్వర్యంలో మామునూరులో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు సరిగా లేని పలు వాహనాలు, బెల్టు షాపుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వేకువజామునే పోలీసులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతుండడంతో ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ కాలనీల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. యువకులు రోడ్లపై తిరుగుతూ ఎవరితోనైనా గొడవ పడినా, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపి, పోలీసులను మరింత చేరువ చేసేందుకు కార్డన్ సెర్చ్ దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల నేరాలకు పాల్పడే వారిలో భయం పుడుతుందన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అరుణ పలు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ మామునూరు సీఐ రమేశ్, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, మామునూరు, పర్వతగిరి, గీసుగొండ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తప్పుడు విధానాలకు పాల్పడితే చర్యలు
వర్ధన్నపేట: గ్రామాల్లో ఎవరైనా తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ హెచ్చరించారు. బండౌతాపురంలో సీఐ సదన్కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ పామాట్లాడుతూ యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కుటుంబాలు ఛిద్రం అవుతాయని సూచించారు. ఈ సందర్భంగా 20 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు రామారావు, మంగ, వంశీకృష్ణ, మాదవ్, 40 మంది సిబ్బంది పాల్గొని గ్రామంలోని ప్రతీ ఇంటిని సోదా చేశారు.