‘చేసిన పనులే ఎన్ని సార్లు చేస్తరు. శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టండి. రెండేళ్లకోసారి శాశ్వత ప్రాతిపదికన చేసినవాటికి కూడా నిధులు అడుగుతున్నరు.. పనులు నాసిరకంగా ఎందుకు చేస్తున్నరు.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మహాజాతర ఏర్పాట్లపై తాడ్వాయి మండలం మేడారంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి, వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరకు అధిక నిధులు కేటాస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.75 కోట్లు కేటాయించామని చెప్పారు. ‘వచ్చామా.. పనులు చేయించామా.. వెళ్లామా అని కాకుండా భక్తుల సేవను అమ్మవార్ల సేవగా భావించి అధికారులు విధులు నిర్వర్తించాలి’ అని ఆదేశించారు. శాశ్వత పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేయాలని, ఇందుకు పూర్తి బాధ్యత అధికారులదేనన్నారు. తల్లుల ప్రసాదం ప్రతి భక్తుడికి అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తాడ్వాయి, డిసెంబర్ 1 : మేడారం మహా జాత ర సందర్భంగా చేపట్టే పనుల్లో శాశ్వత నిర్మాణాలపై దృష్టిపెట్టాలని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహాజాతర ఏర్పాట్లు, నిర్వహణపై బుధవారం మండలంలోని మేడారంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జంపన్నవాగులో నిర్మించిన చెక్డ్యామ్ కూల్చివేత పనులను పరిశీలించారు. డ్యామ్ కడితే ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించకుండా రూ.9 కోట్లు నీళ్లల్లో పోశారని ఇరిగేషన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి శాశ్వత, తాత్కాలిక పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. శాశ్వత పనులకు సైతం ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా నిధులు అడుగుతున్నారని, పనులు ఎందుకు నాసిరకంగా చేస్తున్నారని ప్రశ్నించారు. పదికాలాల పాటు నిర్మాణాలు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతర పరిసరాల్లో చేపట్టే ప్రతి పని నాణ్యతతో ఉండాలని, ఆ పనిని ఐదేళ్లపాటు వారే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జాతరకు అధిక నిధులు కేటాయిస్తూ వస్తున్నదన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్లు కేటాయించిందని, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పారు. వచ్చామా.. పనులు చేయించామా.. వెళ్లామా అని కాకుండా భక్తుల సేవను అమ్మవార్ల సేవగా భావించి అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. జాతర సందర్భంగా చుట్టుపకల గ్రామాల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత జాతర అనుభవాలతో పనులు చేయించి మహాజాతరను విజయవంతం చేయాలని సూచించారు. జాతర అనంతరం ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తల్లుల ప్రసాదం ప్రతి భక్తుడికి అందేలా ఏర్పాట్లు చేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. గత జాతరలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక మహిళ మృతి చెందిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆ శాఖ అధికారులను సూచించారు. శాశ్వత నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేయాలని, దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ తరుపున అందించిన క్రికెట్, వాలీబాల్ కిట్లను 13 యువజన సంఘాలకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ములుగు జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ వాణిశ్రీ, సర్పంచులు బాబురావు, శ్రీధర్, అరుణ, రమ, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య పాల్గొన్నారు.