చెన్నారావుపేట, నవంబర్ 16: ప్రతి పాఠశాలలో డిసెంబర్16వ తేదీ వరకూ ఉదయం 8.30 నుంచి 9.30 వరకు నిర్వహించే స్పెషల్ క్లాసులకు పదో తరగతి విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వ సహాయ పరీక్షల నియంత్రణ జిల్లా అధికారి ఉండ్రాతి సుజన్తేజ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని జల్లి ప్రాథమిక పాఠశాల, హైస్కూల్, లింగగిరి, బీసీకాలనీల్లోని ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్కూళ్లలో రికార్డులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. పాఠశాలల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను విద్యార్థులకు నేర్పించేలా ‘త్రీఆర్స్’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారాంతపు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, 9, 10వ తరగతి చదివే బీసీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 19 నుంచి 22 వరకు లింగగిరిలో 31వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించే ఆటస్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఎం బైరీ సరళ, ఈర్యా, మాధురి, వీఎస్ శారద, సీఆర్పీలు సంపత్, శిల్ప ఉన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఖానాపురం: టెన్త్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నోడల్ ఆఫీసర్ దూలం రాజేందర్ సూచించారు. అశోక్నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రారంభమైన ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. ప్రతి విద్యార్థి ఇప్పటి నుంచే వార్షిక పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం మంజుల ఉన్నారు.