నర్సంపేట, నవంబర్ 16: సిటీ ప్రజలు పల్లెల్లోని జాగలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరాలు, పట్టణాల్లో కరోనా విజృంభించి, వరదలు ఉప్పొంగి చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పల్లెల వైపు చూస్తున్నారు. పట్టణాల్లోని వ్యాపారులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఎన్ఆర్ఐలు, పలు ప్రాంతాల్లో సెటిలైనవారు తాము పుట్టినగడ్డపై జాగలు కొంటున్నారు. గతంలో పల్లెల్లో కంటే పట్టణాల్లోనే భూములు కొనేందుకు ఇష్టపడేవారు. కొత్త జిలాల ఏర్పాటు తర్వాత పల్లెల్లోని భూముల రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. మెయిన్ రోడ్లకు ఇరువైపులా ఉన్న భూములను ఇప్పటికే కొనేశారు. ఆ తర్వాత రెండో, మూడో బిట్లను కూడా కొంటున్నారు.
పొలాలపైనే ఆసక్తి
ప్రధానంగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పొలాలను కొనుగోలు చేసి ఫాంహౌస్లు, చేపలచెరువులు వంటివి నిర్మించుకుంటున్నారు. పొలాలు, చెలకల్లో వ్యవసాయ చేయిస్తున్నారు. మరికొందరు చుట్టూ ప్రహరీలు కట్టేసుకుని స్థలాలను కాపాడుకుంటున్నారు. నర్సంపేట చుట్ట్టుపక్కల మండలాలైన చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో భూములకు ధరలు భారీగా పెరిగాయి. జిల్లాలోని ఇతర మండలాల్లోనూ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
నర్సంపేటలో గజానికి రూ.60వేల పైనే..
నర్సంపేట బస్టాండ్కు కూతవేటు దూరంలో మెయిన్ రోడ్డుకు 30 గుంటల స్థలాన్ని కొన్ని నెలల కింద కొందరు రూ.15.30కోట్లకు కొనుగోలు చేశారు. ఆరు నెలలు గడుస్తుండగా అదే స్థలాన్ని ఇప్పుడు హైదరాబాద్కు చెందిన కొందరు వ్యాపారులు రూ.20కోట్లకు అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గజానికి రూ.60వేలకు పైగా పలుకుతున్నట్లయ్యింది. వరంగల్ జిల్లాలోనే కీలకంగా నర్సంపేట ఉన్నందున ఇక్కడి భూములకు రెక్కలు వస్తున్నాయి. నర్సంపేట బస్టాండ్కు అతి సమీపంగా గజానికి రూ.50వేల పైనే పలుకుతోంది. మెయిన్ రోడ్డు పక్కనున్న స్థలాలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంగడి, నెక్కొండ రోడ్డు ఏరియా ప్రాంతంలో గజానికి రూ.20వేల నుంచి రూ.25వేలు పలుకుతోంది. పట్టణంలో నివాస స్థలాలు దొరక్కపోవడంతో వ్యవసాయ భూములను కొని ఇండ్లు నిర్మిస్తున్నారు. పట్టణం చుట్టుపక్కల ఉన్న భూములకు రూ.3కోట్లకు పైగా రేట్లు పలుకుతున్నాయి. 2003లో గుంట భూమికి రూ.30వేలు పలికిన భూములకు ఇప్పుడు రూ.10లక్షల నుంచి రూ.15లక్షలకు పెరిగింది. నర్సంపేట నుంచి వరంగల్ వరకు దారి పొడవునా చుట్టుపక్కల భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఎకరానికి రూ.3కోట్లకు పైగానే పలుకుతోంది. నెక్కొండ, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లోనూ మెయిన్ రోడ్డుకు ఉన్న భూములకు కూడా రెక్కలు వచ్చాయి. ఇక్కడ రూ.1.50కోట్ల నుంచి రూ.2కోట్ల వరకు పలుకుతున్నాయి. గతంలో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన ఎకరం భూమికి ఇప్పుడు అమాంతంగా రూ.౩కోట్లకు పెరిగింది.
ఆస్తుల సంపాదన కోసమే…
పల్లెలు, చిన్న పట్టణాల్లో ఆస్తులు సంపాదించుకునేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు పల్లెల్లో ఆస్తులు కలిగి ఉండాలని భావిస్తున్నారు. పల్లె వాతావరణం బాగుండడం వల్ల స్థిర నివాసాలు కూడా ఏర్పరచుకుంటున్నారు. కొందరూ ఫౌంహౌస్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోడ్లకు ఇరువైపుల ఉన్న భూములు, వ్యవసాయ భూములకు రెక్కలు వచ్చాయి. గతంలో రూ.లక్ష లోపే పలికిన ధరలు ఇప్పుడు కొన్నేళ్లలోనే భారీగా పెరిగిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో నర్సంపేట ప్రాంతం గతంలో వరంగల్ రూరల్ జిల్లాలో ఉండేది. మార్పుల తర్వాత ఇప్పుడు వరంగల్ జిల్లాలోకి వెళ్లిపోయింది. నర్సంపేట జిల్లాలో ముఖ్య పట్టణంగా రూపొందుతున్నది. అందుకే భూముల ధరలు వరంగల్ పట్టణంలో కన్నా నర్సంపేట పట్టణంలో అధికంగా పలుకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను చదును చేసి ప్లాట్లు చేస్తున్నారు. తమ భూములకు మంచి రేట్లు వస్తుండడంతో కొందరు రైతులు అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. మరికొందరు ఇంకా ధరలు పెరుగుతాయని ఉంచుకుంటున్నారు.
ధరలు విపరీతంగా పెరిగాయి
భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువగా వ్యాపారులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఎన్ఆర్ఐలు పల్లెల్లో ఉన్న భూములను కొనడానికి ఇష్టపడుతున్నారు. రోడ్ల పక్కన భూములు ఎక్కడా దొరకడం లేదు. ఏ మండల కేంద్రానికి, గ్రామాలకు వెళ్లినా రూ.కోటిన్నర పైనే రేట్లు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలు కొనుగోలు చేయడం వల్ల భూములు ధరలు గతంలో కంటే భారీగా పెరిగాయి.
ఇళ్ల స్థలాలు దొరకడం లేదు
ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలంటే సామాన్యులకు ఇబ్బందిగానే ఉంది. ధరలు ఐదేళ్ల కింద నుంచే పెరిగిపోయాయి. మండలాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నారు. ముందస్తుగా చాలామంది డబ్బు నిల్వ ఉన్న వారు ఆస్తులు కొనుగోలు చేసుకుని ఉంచుకుంటున్నారు. పల్లెల్లో వాతావరణం మంచిగ ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రోళ్లు ఇక్కడి భూములకు ధరలు పడిపోతాయని ప్రచారం చేశారు. కానీ, విపరీతంగా పెరగడంతె రైతులకు న్యాయం జరుగుతున్నది.