ఖిలావరంగల్, నవంబర్ 9: న్యాయ సేవాధికార సంస్థ ఏడు రకాల సేవలు అందిస్తున్నదని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నందికొండ నర్సింగరావు అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కోటలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని సూచించారు. ఇప్పటి వరకు ఒక్కో గ్రామంలో మూడుసార్లు, 13 వందల గ్రామాల్లో ఐదు వేల సదస్సు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సులో ఉచిత న్యాయ సహాయం ఎలా అందుతుందో వివరించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్నాథ్, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, ఏసీపీలు గిరికుమార్, బాలస్వామి, వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పీ పురుషోత్తం, ఆర్టీవో ఆఫ్రీన్ సిద్ధిఖి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేపీ ఈశ్వర్నాథ్, ప్రధాన కార్యదర్శి ఎం విజయ్కుమార్, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, సీనియర్ న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్, తీగల జీవన్ పాల్గొన్నారు.
చట్టాలపై మహిళలకు అవగాహన
సంగెం: శాంతి మండల సమాఖ్య భవనం ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నేతృత్వంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయవాది పద్మజా మాట్లాడుతూ మహిళలు, పేదలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో సుప్రీంకోర్టు ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసి గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నదన్నారు. సమావేశంలో జిల్లా న్యాయవాది గోపికారాణి, డీపీఎం దయాకర్, ఏపీఎం కిషన్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కల్యాణి, సీసీలు కుమారస్వామి, ఏలియా, సురేశ్, రాజయ్య, కృష్ణమూర్తి, స్వరూపారాణి పాల్గొన్నారు.