మహదేవపూర్/ కాళేశ్వరం, డిసెంబర్ 2 : కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత కట్టడమని నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్) చైర్మన్ జీఆర్ చింతల అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో కలిసి లక్ష్మీ పంప్హౌస్, బరాజ్ను సందర్శించారు. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా వచ్చిన వారికి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. మొదటగా లక్ష్మీ(కన్నెపల్లి) పంప్హౌస్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని లిఫ్ట్ ద్వారా కిందకు దిగి కంప్యూటర్ రూమ్ లోకి చేరుకున్నారు. అక్కడ డిజిటల్ స్క్రీన్ ద్వారా పంప్హౌస్ గురించి ఈఎన్ఈసీ ముళీధర్రావు వివరించారు. మోటార్ల పనితీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి లక్ష్మీ బరాజ్కు చేరుకుని వ్యూపాయింట్ నుంచి నీటి సామర్థ్యంతోపాటు గేట్లను పరిశీలించారు. బరాజ్ ఆవశ్యకతను సంబంధిత ఇంజినీరు అధికారులను అడిగి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వంతెనను సైతం సందర్శించి అక్కడి నుంచి నీటిని పరిశీలించారు.
కాళేశ్వర ముక్తీశ్వరుడికి పూజలు
నాబార్డ్ చైర్మన్ చింతల, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదట గణపతి వద్ద పూజలు చేసి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పార్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశాక అర్చకులు ఆశీర్వచననం చేసి స్వామి వారి శేషస్త్రాలతో సన్మానించి, చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఎన్ఎన్సీ హరిరాం, వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతి, డీఈ సురేశ్, ఏఈ భరత్, ఎస్సై సాయిప్రసన్న, నాబార్డు డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.