వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, మార్చి 31 : కరోనా సెకండ్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం శివనగర్ క్యాంపు కార్యాలయంలో మిల్స్కాలనీ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లు, బ్యానర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలన్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించి కరోనాను తరిమి కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ జే రవికిరణ్, ఎస్సై సతీశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల్లు
ఇచ్చిన మాట ప్రకారం జర్నలిస్టులకు త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. బుధవారం సాయి కన్వెన్షన్ హాల్లో వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ద్వితీయ వార్షికోత్సవ సభకు ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. టెండర్లు సైతం పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జక్కుల విజయ్కుమార్, కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా గజ్జి సురేశ్బాబు, ఉపాధ్యక్షుడిగా చిన్నబాబు, సహాయకోశాధికారిగా మైదం వెంకన్నను ఎన్నుకున్నారు.
బదిలీపై వెళ్తున్న పశు వైద్యాధికారికి సన్మానం
ఖిలావరంగల్ పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీశైలం ఉద్యోగన్నతిపై నిజామాబాద్కు బదిలీ అయ్యారు. కాగా, కోటలోని పశువైద్యశాల ఆవరణలో డాక్టర్ శ్రీశైలం దంపతులను ఎమ్మెల్యే నరేందర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.