జొన్న రొట్టె.. బలవర్ధకమైన ఆహారం.. నేటి పరుగుల జీవితంలో బీపీ, షుగర్ ఇతర వ్యాధులు దాడి చేయకుండా మొదట్లోనే కంట్రోల్ చేస్తుంది. అందుకే ఆహార జీవనశైలిని మార్చుతున్నారు. రోజూ మెనూలో రొట్టెను ఉంచుతున్నారు. అలాగే రాగి సంకటి, గంజి, కొర్ర బియ్యం, దంపుడు బియ్యం, అంబలి వంటి చిరుధాన్యాల వంటకాలపై ఆసక్తి చూపుతున్నారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉంటున్నారు.
వనపర్తి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. చిరుధాన్యాలతో చేసిన వంటకాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పని ఒత్తిడి, సంపాదన కోసం ఉరుకులు పరుగుల జీవితంతో బీపీ, షుగర్ తదితర వ్యాధులు త్వరగా వస్తున్నాయి. వీటిని మొదట్లోనే రాకుండా చూసుకోవాలని కొందరు, నియంత్రణలోకి తెచ్చుకోవాలని వ్యాధులు వచ్చిన వారు ఇలా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. రెగ్యులర్గా తినే ఆహారాన్ని మార్చి జొన్నరొట్టె, రాగి సంకటి, గంజి, కొర్ర బియ్యం, దంపుడు బియ్యం, అంబలి, గటిక, వివిధ రకాల పండ్లు మెనూలో చేర్చుకుంటున్నారు. ఫాస్ట్ఫుడ్, బిర్యానీ వంటి ఆహార పదార్థాలను దూరంగా ఉంచుతున్నారు. స్వీట్లు ముట్టుకోవడం లేదు. ముఖ్యంగా పచ్చజొన్న, తెల్లజొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, రాగి సంకటి వంటి పదార్థాలు తింటున్నారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడంతో జంక్ఫుడ్స్కు దూరంగా ఉంటున్నారు.
విరివిగా జొన్నరొట్టె సెంటర్లు..
ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో జొన్న రొట్టెలకు డిమాండ్ పెరుగుతున్నది. రొట్టెలు తిందామని అందరికీ ఉన్నా.. కొంతమంది ఇండ్లల్లో చేయడానికి రాకపోవడంతో హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో జొన్నరొట్టె కేంద్రాలు విరివిగా వెలుస్తున్నాయి. రొట్టెలు తినేందుకు ఆసక్తి చూపుతుండడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో జొన్నరొట్టె రూ.10 నుంచి రూ.12 వరకు అమ్ముతున్నారు. రోడ్ల పక్కన వెలిసిన జొన్నరొట్టె కేంద్రాలే కాకుండా హోటళ్లు, దాబాల్లో కూడా వీటి అమ్మకాలు పెరిగాయి. రొట్టెలతో పాటు పప్పు, నాటుకోడి, మటన్ కీమా వంటి వంటకాలకు ఫుల్ డిమాండ్ ఉన్నది. అల్పాహారంలో, డిన్నర్లో రొట్టె ఆరగిస్తున్నారు. చిన్న చిన్న పార్టీల్లో కూడా జొన్నరొట్టె తప్పనిసరి చేస్తున్నారు. ఒకప్పుడు పేదోడి ఆహారంగా ఉన్న జొన్నరొట్టె ఇప్పుడు అన్ని వర్గాలకు ప్రియంగా మారింది.
పీచు పదార్థాలకు డిమాండ్..
జొన్నలు, సజ్జలు, కొర్రలు, పరిగెలు, రాగులు, కుసుములు, సజ్జలు వంటి చిరుధాన్యాలతో చేసిన వంటకాలకు డిమాండ్ పెరిగింది. అందరూ ఆహారంలో వీటిని ఉండేలా చూసుకుంటున్నారు. చిరుధాన్యాలు, మాంసకృత్తులు 10 శాతం కలిగి ఉండడంతో వైద్యులు వీటిని తినాలని సూచిస్తున్నారు. వీటిలో విటమిన్ బీ 12, బీ 17, బీ 6తోపాటు పీచు పదార్థాలు ఉంటాయి. షుగర్ పేషంట్లకు చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. చిరుధాన్యాలతోపాటు డ్రైఫ్రూట్స్కు, పండ్లకు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బరువు తగ్గించేందుకు కూడా ఆహార పదార్థాలు ఉపయోగపడుతున్నాయి.
ఆరోగ్యానికి మంచిది..
చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ఎవ్వరికైనా మేలు చేస్తాయి. శారీరక శ్రమ చేస్తూ, పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రస్తుతం ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులతో జంక్ఫుడ్స్ వైపు వెళ్లకుండా బలమైన ఆహార పదార్థాలు అవసరం. మధుమేహం, గుండె జబ్బుల వంటి రోగాలు అటాక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూట్రీషియన్స్ కూడా రొట్టెలను తినాలని సూచిస్తున్నారు.
అన్నం బదులు రొట్టె..
జొన్నరొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నతనం నుంచీ అన్నం బదులు రొట్టె తింటున్నా. ఇప్పుడు బలం ఇస్తుందని పిల్లలకు ఏదేదో తినిపిస్తారు. దీంతో ఈ నాటి తరం గట్టిగా పది అడుగులు వేయలేకపోతున్నారు. నాకు 80 ఏండ్లు. ఇప్పటికీ ఆయాసం లేకుండా నడుస్తా. నా పనులు నేనే చేసుకుంటా. అంబలి తాగే వాళ్లం. మేము చెబితే ఇప్పుడు ఎవరూ వినడం లేదు. పాతకాలం ఆహారపు అలవాట్లు చాలా మంచివి.
రాత్రి వరకు రొట్టెలు చేస్తా..
ఉదయం నుంచి సాయంత్రం వరకు జొన్నరొట్టెకు డిమాండ్ ఉంటుంది. పొద్దుగాల నుంచి రా త్రి వరకు రొట్టెలు అమ్ముతుంటాను. చాలా మం దికి రొట్టెలు చేయడం రాదు. అందుకే మా దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నాతోపాటు మరికొంత మంది మహిళలకు జొన్నరొట్టె వల్ల ఉపాధి దొరుకుతున్నది.