వనపర్తి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): అన్నం పెట్టే అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం వనపర్తి నియోజకవర్గంలో ప్రారంభం కానున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. 41 రైతు వేదికల్లో ఒకేసారి 10వేల మంది రైతులతో సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఒక్కో వేదికలో 200నుంచి 500 మంది ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతువేదికలో వ్యవసాయరంగంపై అవగాహన కలిగిన వక్త ఉంటారన్నారు. 2014కు ముందు, తర్వాత తెలంగాణ వ్యవసాయ, రైతాంగ పరిస్థితులపై చర్చ, తెలంగాణ వ్యవసాయ విజయాలు రైతాంగం దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. పంటల కొనుగోళ్లు, పంట మార్పిడి ఆవశ్యకత, ఎరువులు, రసాయనాల వాడకం, యాజమాన్య పద్ధతులపై చర్చ జరుగుతుందన్నారు. వ్యవసాయం దండుగ అన్న పరిస్థితి నుంచి పండుగలా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. సాగునీటి కల్పన, మిషన్కాకతీయతో చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగి సాగునీటి ముఖ చిత్రం మారిందన్నారు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కినా మనం తినే ఆహారానికి ప్రత్యామ్నాయం సృష్టించలేమన్నారు. కేవలం చెమట చిందించి భూమి నుంచి పొందాల్సిందేనన్నారు. నియోజకవర్గంలో జరిగే సమ్మేళనాలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని రైతులకు సూచించారు.
బ్రిడ్జిని నాణ్యవంతంగా నిర్మించాలి
వనపర్తి, అక్టోబర్ 31: వనపర్తిలోని చిట్యాల రోడ్డు చింతల హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జిని నాణ్యవంతంగా నిర్మించాలని కాంట్రాక్టర్ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, నాయకులతో కలిసి మంత్రి ఆదివారం బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి నాణ్యవంతంగా నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం పాతబజార్లో డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు సమద్, నాగన్న, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య పాల్గొన్నారు.
వే బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి
వనపర్తి రూరల్, అక్టోబర్ 31: వేబ్రిడ్జి ఏర్పాటుతో అధిక లోడ్ వాహనాల రవాణాను అరికట్టవచ్చని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిమనగుంటపల్లి శివారులో ఆదివారం వే బ్రిడ్జిని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. త్వరలోనే నూతన మార్కెట్యార్డు సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని, దీనివల్ల పలు రకాల మార్కెట్ వ్యాపారులకు అనుకూలంగా ఈ ప్రదేశం ఉండబోతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వనపర్తి సహకార సంఘం చైర్మన్ వెంకట్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, నాయకులు రఘువర్ధన్రెడ్డి, సంపత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.