ఉద్యోగ లోకానికి ఎనిమిదేండ్లుగా అన్యాయం
ఈసారీ దక్కని ఆదాయ పన్ను రాయితీ
ఉత్తరాది కంటే మన ఉద్యోగులకు వేతనాలు 40 శాతం ఎక్కువ
వాహనాల వినియోగమూ మన దగ్గరే అధికం
ఏడాదిలో ఒక నెల జీతం పన్నులకే..
పెరిగిన ఇంధన ధరలతోనూ జేబుకు చిల్లు
మండిపడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
ఉత్తరప్రదేశ్లో 20 ఏండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుడికి 49 వేల రూపాయల వేతనం ఉండగా అంతే సర్వీసు ఉన్న తెలంగాణ ఉపాధ్యాయుడి జీతం రూ.80వేలు. అక్కడి టీచర్ ఏటా .5వేల నుంచి 6 వేలలోపే ట్యాక్స్ చెల్లిస్తుండగా, ఇక్కడ మాత్రం రూ.80వేలు చెల్లించాల్సి వస్తున్నది. ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులందరిదీ ఇదే పరిస్థితి. ఇదీ కేంద్రంలోని మోడీ సర్కారు నీతి. ఆదాయ పన్ను స్లాబ్ పెంపుపై ఎనిమిదేండ్లుగా ఎదురుచూస్తున్న వేతనజీవులకు ఈసారీ నిరాశే ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తమను పూర్తిగా విస్మరించడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. పన్ను రాయితీని ప్రకటించకుండా, ఏడేండ్ల కిందటి కనీస ఆదాయ పరిమితినే కొనసాగిస్తుండడం వల్ల ఒక నెల జీతం పన్నులకే కట్టాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీతోపాటు అలవెన్సులు పెంచడం వల్ల దేశంలోనే అత్యధిక వేతనాలు రాష్ట్రంలో అందుతున్నాయి. ఆ మేరకు ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చుకుంటే మన దగ్గర వాహనాల వినియోగం కూడా ఎక్కువే. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అధిక మొత్తంలో ట్యాక్స్లు చెల్లించాల్సి వస్తున్నది. ఇవేమీ పట్టించుకోని బీజేపీ సర్కారు ఉద్యోగుల వెన్నువిరుస్తున్నదని ఉద్యోగ సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. మధ్య తరగతికి పైసా ప్రయోజనం చేకూర్చని బడ్జెట్ ఎవరి కోసమంటూ నిలదీస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. మోడీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం మోపుతూ కార్పొరేట్ రంగానికి తలుపులు బార్లా తెరుస్తున్నదనే వాదనలు వినిపిస్తుండగా.. తాజా బడ్జెట్లోనూ అదే పునరావృతమైందని పేర్కొంటున్నాయి. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ మరో పక్క జీఎస్జీ, గ్యాస్, పెట్రో ధరల పెంపుతో సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని నిరసించాయి. ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో నిలువు దోపిడీకి గురవుతున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
బడ్జెట్లో తెలంగాణ ఉద్యోగులకు తీరని అన్యాయం…
ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నది తెలంగాణ ఉద్యోగులే. ఇక్కడి ఉద్యోగులతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తక్కువ వేతనాలు ఉండడంతో వారు పన్ను పరిధిలోకి రావడం లేదు. ఉత్తరప్రదేశ్లో 20ఏండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుడికి రూ.49వేల వేతనం ఉండగా ఇక్కడ రూ.80వేలు ఉన్నది. ఈ లెక్కన అక్కడి ఉపాధ్యాయుడు కేవలం రూ.5 నుంచి 6వేల ట్యాక్స్ చెల్లిస్తుండగా తెలంగాణ ఉద్యోగి మాత్రం ఓ నెల వేతనం.. అంటే దాదాపు రూ.80వేలు చెల్లించాల్సి వస్తున్నది.
ఇన్కం స్లాబుల్లో అన్యాయం..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇన్కం ట్యాక్స్ స్లాబులు పెంచకుండా ఉద్యోగులకు అన్యాయం చేసింది. కేవలం పన్నుల మీదనే దృష్టి పెట్టడం విచారకరం. ఉద్యోగుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మధ్య తరగతి, వేతన జీవులు ఆశించే విధంగా బడ్జెట్లో మార్పు లేకపోవడంతో పూర్తిగా నిరాశ చెందాం. బీజేపీ సర్కారు ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు పెంచి ఆదుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపేణా దండుకుంటున్నది. ఉద్యోగుల కష్టాన్ని పన్ను రూపంలో వసూలు చేయడం అన్యాయం. ఉద్యోగుల వేతనాల్లో అధికంగా పన్నులకే వెళ్తుండడంతో కుటుంబ పోషణ కష్టమయ్యే పరిస్థితి. ఐటీ స్లాబ్లు పెంచి ఉద్యోగులను ఆదుకోవాలి.
– ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, నడిగూడెం
పన్ను పరిమితి పెంచకపోవడం అన్యాయం
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిపై కేంద్రం ఊసెత్తకపోవడం విచారకరం. ఎనిమిదేండ్లుగా పాత పద్ధతినే కొనసాగించడం తీవ్ర అన్యాయం. కేంద్రం వైఖరితో తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్టాండర్డ్ డిడక్షన్లో 80సీ, 80డీ సెక్షన్లో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వేతన జీవులకు అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినా కేంద్రం విధిస్తున్న పన్నులు చెల్లించడానికే సరిపోతుంది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వేతన జీవులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది.
– అంకులయ్య, పీఆర్టీయూ మండల సెక్రటరీ, కోదాడ టౌన్
సంతృప్తి కర బడ్జెట్ కాదు..
ఏడేండ్లుగా ఆదాయ పన్ను స్లాబులు సవరించకపోవడం దారుణం. ఎంతో ఆశగా ఎదురు చూసిన మధ్య తరగతి ఉద్యోగులకు నిరాశ మిగిల్చారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉద్యోగులకు పన్ను మినహాయింపు కల్పించడం లేదు. ఉద్యోగులు ఏటా రెండు నెలల వేతనాన్ని ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పాలక పార్టీలన్నీ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నాయి. ఈ బడ్జెట్ పారిశ్రామిక వర్గాలకు మాత్రమే సంతృప్తి దక్కింది.
– సోమయాజుల సూర్యనారాయణమూర్తి, తెలుగు పండిట్, మఠంపల్లి
ఏటా మొండి చెయ్యే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్లో వేతన జీవులకు ఊరటనిచ్చే అంశాలు ఏమీ లేకపోవటం తీవ్రంగా నిరాశపరిచింది. ఇన్కమ్ టాక్స్ స్లాబ్ను రెండేండ్లుగా పెంచడం లేదు. 12 నెలల జీతంలో ఒక నెల వేతనాన్ని ఐటీ రూపంలో కేంద్రం గుంజుకుంటున్నది. దాంతో వేతనం ఎక్కువ ఉన్నా ప్రయోజనం లేకుండా పోతున్నది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, ఫిట్మెంట్ సరిగా ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు తప్పడం లేదు.
పన్ను భారం బాధాకరం
ఉద్యోగుల ఆదాయ పన్ను విషయంలోని స్లాబ్స్ పెంచాలని పలు మార్లు వినతి పత్రాలు అందించాం. అయినప్పటికీ కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరం. అదే విధంగా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగం లేకుండా బడ్జెట్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లింపుపై జీఎస్టీని కూడా తగ్గించకపోవడంతో పాలసీదారులపై ఆర్థిక భారం పడుతుంది.
– గుణగంటి శేఖర్, సీనియర్ అసిస్టెంట్, ఎల్ఐసీ, నల్లగొండ
కేసీఆర్ ఇస్తుంటే.. మోడీ గుంజుకుంటున్నడు..
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ కోరిన పీఆర్సీ ప్రకటించారు. ఇతర అలవెన్సులు సైతం భారీగానే ఇస్తున్నారు. కానీ, ప్రధాని మోడీ మాత్రం కేసీఆర్ ఇస్తున్న వేతనాలను పరోక్షంగా వసూలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో పాటు ఆదాయ పన్ను పేరుతో ఉద్యోగుల శ్రమ, ఆదాయాన్ని గుంజుకుంటున్నారు.