రూ. 3కోట్లతో అభివృద్ధి పనులు
సర్వ హంగులతో వైకుంఠధామం
ఆహ్లాదాన్ని పంచే మొక్కలతో సుందరీకరణ పనులు
త్వరలో ప్రారంభం..
పీర్జాదిగూడ, డిసెంబర్ 26 : చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి తుది వీడ్కోలు పలికే ప్రదేశం వైకుంఠధామం. ఇప్పటి దాకా మనిషి తనువు చాలిస్తే ఊరు చివర, వ్యవసాయ భూముల్లోనో సరైన స్థలం లేక రహదారుల ప్రక్కనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఉండేది. ఉమ్మడి పాలనలో దహన సంస్కారాలు, కర్మకాండలు, నిర్వహించడానికి మౌలిక వసతులు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడే వారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని వైకుంఠ ధామాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి… మేడిపల్లిలో నూతనంగా సుమారు 2 ఎకరాల స్థలంలో రూ. 3 కోట్ల సీఎం నిధులు, మున్సిపల్ నిధులతో అత్యాధునిక హంగులతో వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
వైకుంఠధామంలో ప్రత్యేక ఏర్పాట్లు…
ఈ వైకుంఠధామంలో ఆహ్లాదాన్ని పంచేందుకు గ్రీనరీ ఏర్పాటు, మృతదేహాలను కాల్చేందుకు గద్దెల నిర్మాణం, అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు స్నానాలు చేసేందుకు షవర్లతో బాత్రూంల నిర్మాణం, శాశ్వత నీటి సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటికలో పిండాలు పెట్టేందుకు అనువైన స్థలంలో చిన్న చిన్న గద్దెలు, అంత్యక్రియలు చేపట్టే వారికి ఆహ్లాదం కలిగేలా ఆవరణలో మొక్కలు నాటారు. పచ్చదనం ఉట్టిపడేలా గార్డెన్ ఏర్పాటు చేశారు. శ్మశానవాటిక ఎదుట శివుడి విగ్రహం,లోపల కాటికాపరి సత్యహరిచంద్ర విగ్రహాలను ఏర్పాటు చేశారు. విశ్రాంతి గదులు, మూడు బర్నింగ్ స్లాబ్లు, మహిళలు, పురుషులకు టాయిలెట్స్ గదులు, సుమారు 100 మందికి సీటింగ్ గ్యాలరీ, సుందరీకరణ మొక్కలు, గ్రీనరీ ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికలో అభివృద్ధి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం
అంతిమ సంస్కారాలకు హాజరయ్యే బాధిత కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది. ఈ మేరకు నగరపాలకలోని మేడిపల్లి వైకుంఠధామానికి సీఎం కేసీఆర్ రూ. 3కోట్లు కేటాయించారు. అన్ని హంగులతో వైకుంఠధామం పూర్తయ్యింది. త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం
-జక్క వెంకట్రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ కార్పొరేషన్