అబూదాబి: విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆ స్టార్ క్రికెటర్ ఇప్పుడో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్లు ఆడిన భారతీయ క్రికెటర్గా నిలువనున్నాడు. ఆదివారం దుబాయ్లో దాయాది పాకిస్థాన్తో జరగనున్న టీ20 మ్యాచ్తో ఆ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో 99 మ్యాచ్లు ఆడాడు కోహ్లీ. ఇక పాక్తో జరిగే మ్యాచ్తో వందవ టీ20 ఆడిన క్రికెటర్గా చరిత్రలో నిలిపోనున్నాడు. అయితే ఇప్పటికే టెస్టులు, వన్డేల్లోనూ కోహ్లీ సెంచరీ మ్యాచ్లు ఆడేశాడు.
ప్రతి ఫార్మాట్లోనూ కోహ్లీ వంద మ్యాచ్లు ఆడాడంటే అతని సత్తా ఏంటో తెలుసుకోవచ్చు. ఇంత సుదీర్ఘ కాలం అతను అన్ని ఫార్మాట్లు ఆడుతున్నాడంటే అతను ట్యాలెంట్ను ప్రశంసించకుండా ఉండలేం. 2008లో కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. 99 టీ20లు ఆడిన కోహ్లీ ఇప్పటి వరకు 3308 రన్స్ చేశాడు. 50.12 సగటుతో ఆ స్కోరింగ్ చేశాడు. టీ20 ఫార్మాట్లో కోహ్లీ బెస్ట్ స్కోర్ 94 రన్స్. ఈ ఫార్మాట్లో అతను మొత్తం 30 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు.
టీ20 ఫార్మాట్లో 2017 నుంచి 2021 వరకు మొత్తం 50 మ్యాచ్లకు కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల్ని చేపట్టాడు. దాంట్లో 30 మ్యాచ్లు నెగ్గగా మరో 16 మ్యాచుల్లో ఓటమి పాలయ్యాడు. రెండు మ్యాచ్లు టై అవ్వగా, రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. కెప్టెన్గా విన్నింగ్ పర్సంటేజ్ 64.58 శాతంగా ఉంది. ఆసియా కప్లో రేపు పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ మళ్లీ తన పాత ఆటను ప్రదర్శిస్తాడన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. చివరి సారి పాక్తో ఆడిన టీ20 మ్యాచ్లో ఇండియా ఓడినా.. ఆ మ్యాచ్లో కోహ్లీ 57 రన్స్ చేశాడు.
అయితే ఇటీవల భారీ స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లీ ఈ మ్యాచ్లో రాణిస్తాడని ఆశిస్తున్నారు. అతని ఖాతాలో సెంచరీ లేక దాదాపు వెయ్యి రోజులు దాటింది. చివరిసారి 2019 నవంబర్లో అతను సెంచరీ చేశాడు. రేపు పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ మళ్లీ విజృంభిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.