Virat Kohli | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను ఆదర్శంగా తీసుకొని మైదానంలో అడుగుపెట్టిన విరాట్.. ఇప్పుడు తన గురువు రికార్డులనే తిరగరాస్తున్నాడు. మాస్టర్ బ్లాస్టర్తో కలిసి ఎన్నో మ్యాచ్ల్లో టీమ్ఇండియాకు విజయాలు అందించిన కోహ్లీ.. ప్రొఫెషనల్ క్రికెటర్గా మారకముందు సచిన్కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్లో భాగంగా అరవీర భయంకర పాకిస్థాన్ బౌలర్లను సచిన్ ఊచకోత కోసిన విషయాన్ని కింగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తన రియాక్షన్ ఎలా ఉందో చెప్పి ఫ్యాన్స్ను ఖుష్ చేశాడు.
2023 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన పోరులో భారత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ఓపెనర్ సయీద్ అన్వర్ సెంచరీతో చెలరేగగా.. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సచిన్ (75 బంతుల్లో 98; 12 ఫోర్లు, ఒక సిక్సర్) విశ్వరూపం కనబర్చడంతో భారత్ 45.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 276 పరుగులు చేసింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళమనదగ్గ.. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్లను సచిన్ చెడుగుడాడుకోవడం భారత అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు. ముఖ్యంగా షోయబ్ అక్తర్ వేసిన రెండో ఓవర్లో సచిన్ శివతాండవమాడాడు. పాక్ పేసర్ వేసిన బౌన్సర్ను టెండూల్కర్ కట్ షాట్గా సిక్సర్కు పంపిన విధానం చూసి తీరాల్సిందే. సచిన్ ధాటికి ఒకే ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్న అక్తర్ తదుపరి ఓవర్లో బౌలింగ్ ఇవ్వలేదంటే మాస్టర్ విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సమయంలో పాఠశాలలో ఉన్న కోహ్లీ.. ఆ సిక్సర్ చూసి తెగ గంతులేసినట్లు వెల్లడించాడు.