గ్లాస్గో: పర్యావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలు ఏమీ చేయలేకపోతే.. కనీసం నవతరంతో అయినా కలిసి నడవాలని 15 ఏండ్ల భారత విద్యార్థిని వినీశా ఉమాశంకర్ గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రపంచ పర్యావరణ సదస్సు(కాప్ 26)లో పిలుపునిచ్చారు. దేశాధినేతల అబద్ధపు హామీలతో యువతరం విసిగిపోయిందన్నారు. ‘మా భవిష్యత్తును మేమే నిర్మించుకొంటాం’ అని పేర్కొన్నారు. ‘మేం మీపై ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు. అందుకు సమయం కూడా లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు చర్యలు కావాలి. మీరు మీ పాత పద్ధతుల్లోనే ఉండిపోవాలనుకొంటే.. మేమే ముందుండి నడిపిస్తాం. మా వినూత్న ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి చాలు. దయచేసి మాతో చేతులు కలపండి’ అని ఆవేదన వెళ్లగక్కారు. తమిళనాడుకు చెందిన వినీశ.. బొగ్గులతో ఇస్త్రీ చేసే విధానాన్ని చూసి 12 ఏండ్ల వయసులోనే సౌర శక్తితో పనిచేసే ఐరనింగ్ బండిని రూపొందించారు.