ఆ పల్లెలు కొలువుల కోటలు. పోటీ పరీక్ష ఏదైనా నౌకర్లు సాధించాల్సిందే. ప్రతి శాఖలో ఈ గ్రామాల నుంచి ఒక ఉద్యోగి ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల నుంచి 410 మంది, ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) నుంచి 160 మంది సర్కారీ కొలువుల్లో స్థిరపడ్డారు. ఇందులో అత్యధికంగా ఉపాధ్యాయులు, పోలీసులే ఉన్నారు. ఇంకా.. రిటైర్డ్ ఉద్యోగులే వందల సంఖ్యలో ఉండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేట్ కొలువుల్లోనూ అదే స్థాయిలో ఉన్నారు. విశ్రాంత ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకోవడం, సూచనలు, సలహాలు స్వీకరించడం, అహర్నిశలు శ్రమించడం, కోచింగ్ తీసుకోకుండా ఇంటిపట్టునే ఉండి చదువుకోవడం ఇక్కడి యువత ప్రత్యేకత. సోనాల గ్రామానికి చెందిన యువత 1998లో నిర్వహించిన డీఎస్సీలో 16 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగుల పల్లెలుగా గుర్తింపు పొందిన ఆ రెండు గ్రామాలపై ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ) గ్రామంలో 160 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇందులో చిరుద్యోగులుగా మొదలుకొని శాస్త్రవేత్తల వరకు ఉన్నారు. 1960 సంవత్సరంలో మొదటగా ఆరే బాపురావు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ఉద్యోగం సాధించారు. ఆయన ప్రేరణ, ప్రోత్సాహంతో చాలా మంది యువత కష్టపడి చదివి కొలువులు కొట్టారు. ఇందులో 60 మంది టీచర్లు, 55 మంది పోలీస్, ఆర్మీ, 45 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆరే శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో 50 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతస్థానాలకు వెళ్లినవారే. ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇదే గ్రామంలో ఉంటూ యువతకు సూచనలు, సలహాలు ఇస్తూ సర్కారీ కొలువు కొట్టేందుకు సహకరిస్తున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగులు భర్తీ చేస్తామనే ప్రకటనతో యువత పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు సాధిస్తామని అభ్యర్థులు సంతోషంగా తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలలో 1,010 గడపలు, 4,260 మంది జనాభా ఉన్నారు. ఇందులో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు వివిధ హోదాల్లో సుమారు 410 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ప్రైవేట్ రంగంలో కూడా మరో 120 మంది పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న వారే. ప్రైవేట్ పాఠశాలలు అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడి కొలువు కొట్టారు. పాఠశాలకు, ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారు.
గ్రామానికి చెందిన జీ.రాజేశ్వర్, శివరాజ్గౌడ్ 1950లో మొదటగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అప్పట్లో హెచ్ఎస్సీ(హయ్యర్ సెకండరీ స్కూల్) చదువుతున్న వారికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువు దక్కింది. వీరిని స్ఫూర్తిగా తీసుకొని 1952లో బీ.లక్ష్మణ్, గంగారాం.. 1953లో చట్లపెల్లి భోజన్న.. 1959లో తుల నారాయణతోపాటు మరి కొంతమంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు.
జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) మొదలుకొని నాల్గో తరగతి ఉద్యోగుల వరకు గ్రామానికి చెందిన వారు వివిధ హోదాల్లో ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. జిల్లా పంచాయతీ అధికారిగా సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా భూమన్న(ఉద్యోగ విరమణ పొందారు), మోహన్సింగ్(పబ్లిక్ ప్రాసిక్యూటర్), సంతోష్కుమార్ (డిగ్రీ లెక్చరర్), ప్రతాప్సింగ్(డీఎల్) ఇలా జిల్లాస్థాయి నుంచి ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, జూనియర్ లెక్చరర్లు, ఏఈఈలు, ఉపాధ్యాయులుగా 220 మంది, ఆర్టీసీలో 42 మంది, పోలీసు శాఖలో 28 మంది, వైద్యశాఖలో 19 మంది, పంచాయతీరాజ్, పోస్టల్, పశు సంవర్ధకశాఖ, బ్యాంకులు, విద్యుత్, అటవీశాఖలు, గెజిటెడ్ హోదా, నాల్గో తరగతి ఉద్యోగులుగా.. ఇలా ప్రతి విభాగాల్లో కొలువు సాధించారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువులు రాని సుమారు 120 మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఐటీ కంపెనీలు, ఎరువులు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా.. వివిధ విభాగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు 100 మందికి పైగా ఉన్నారు. వీరిలో చాలా మంది గ్రామాభివృద్ధికి తమవంతు తోడ్పాటును అందిస్తున్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే తీరును వివరిస్తూ ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) గ్రామానికి చెందిన లంకా మాలిక చదువుపై ఆసక్తితో ఇంజినీ రింగ్ పూర్తి చేశారు.. 2017లో సివిల్ ఇంజినీర్ పూర్తి కాగా.. తెలంగాణ ప్రభుత్వం 2018లో చేపట్టిన ఇంజినీర్స్ నియమాకాల్లో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఇరిగేషన్శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాలని యువ ఇంజినీర్ సూచిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నేను వివిధ పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం సంపాదిస్తా. మా గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సలహాలు తీసుకుంటా.
– ప్రవీణ్కుమార్, చాందా(టీ), ఆదిలాబాద్ రూరల్ మండలం
నా పేరు అశోక్కుమార్. మాది ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ) గ్రామం. నేను బీఎడ్ పూర్తి చేశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా కల. మా గ్రామంలో చాలా మంది వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. సీఎం సారూ పెద్ద మొత్తంలో ఉద్యోగాలు వేస్తామని ప్రకటించారు. డీఎస్సీతోపాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా. ఏదైనా ఉద్యోగం సాధించి, నా కల నెరవేర్చుకుంటా. రిటైర్డ్ ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకొని ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.