హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిట్లో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ఆడిట్ శాఖ ఆన్లైన్ ఆడిట్ చేసి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. కేంద్ర పంచాయతీరాజ్శాఖ అమలు చేస్తున్న ఆన్లైన్ ఆడిట్ విధానంలో 30 రాష్ర్టాల్లో అన్ని గ్రామపంచాయతీలు కలుపుకొని 13 శాతం మాత్రమే ఆడిట్ పూర్తవగా, తెలంగాణ సులభంగా 100శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించింది. దేశం మొత్తం 2,56,561 పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 32,820 పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ పూర్తయ్యింది. ఇందులో తెలంగాణ 12,769 గ్రామ పంచాయతీలతో దాదాపు 40 శాతం వాటాను భర్తీ చేయటం విశేషం. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్ 6,549, మూడోస్థానంలో తమిళనాడు 5,560 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
ఇంకా ప్రారంభించని 16 రాష్ర్టాలు
ఈ ఏడాది అన్ని రాష్ర్టాల్లో 100 శాతం పంచాయతీలను ఆన్లైన్ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్దేశించగా లక్ష్యాన్ని తెలంగాణ విజయవంతంగా పూర్తిచేసింది. ఇంకా 16 రాష్ర్టాలు ఆన్లైన్ ఆడిట్ను ప్రారంభించక ముందే లక్ష్యాన్ని పూర్తి చేసి సత్తా చాటింది. కాగా, దేశవ్యాప్తంగా 6,703 మండల పరిషత్తులను ఆన్లైన్ ఆడిట్ చేయాలని లక్ష్యం పెట్టుకోగా అందులోనూ తెలంగాణ 540 మండలాలకు గాను 156 మండలాలను పూర్తిచేసి దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిట్లో ఇప్పటి వరకు 2,10,781 అభ్యంతరాలను కూడా రాష్ట్రం నమోదు చేసింది. నిరంతర పర్యవేక్షణతోనే 100 శాతం ఆన్లైన్ ఆడిట్ పూర్తి చేసుకోగలిగామని ఆడిట్ శాఖ తెలంగాణ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. అన్ని జిల్లాల ఆడిట్ అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిగిలిన మండల పరిషత్తుల ఆడిట్ను ఈ నెలలో పూర్తి చేసి, ఆ తర్వాత జిల్లా పరిషత్తుల ఆడిట్లు చేసి నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.