మోమిన్పేట, నవంబర్ 15: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమాన్ని చేపట్టినట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన చక్రంపల్లి గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు విద్యుత్, మిషన్ భగీరథ పైపుల లీకేజీ, మురుగు కాలువలు, రోడ్లు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో మురుగు కాలువలు, చక్రంపల్లి నుంచి గంగారం వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
గ్రామంలో విద్యుత్ సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని అధికారుల కు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజ య్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.