పరిగి, సెప్టెంబర్ 14: ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రతిరోజూ కనీసం నాలుగు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇప్పటివరకు చేపట్టిన వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, పల్లెప్ర కృతి వనాలు, హరితహారం తదితర కార్యక్రమాల పురోగతిపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. వైకుంఠధామాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈలతో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని వైకుంఠధామాలకు విద్యుత్, నీటిసదుపాయాలు కల్పించాని సూచించారు. ప్రతి మండలంలో నిర్దేశించిన మేరకు మొక్కలు నాటాలని కలెక్టర్ కోరారు. ప్రతి గ్రామంలో ఉపాధి కూలీలతో గుంతలు తీయించి మొక్కలు నాటే లక్ష్యం పూర్తి చేయాలన్నారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, మొక్కలు నాటిన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా చెప్పారు. గ్రామ కార్యదర్శులు, సిబ్బంది చురుకుగా పనిచేసేలా ఎంపీడీవోలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఎంపీడీవోలపై చర్యలు తీసుకొంటామని కలెక్టర్ హెచ్చరించారు. వనసేవకులకు సంబంధించిన డబ్బులు వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశించారు. వచ్చే వారం నిర్వహించే సమావేశానికి సూచించిన పనులను పూర్తి చేసిన నివేదికలతో రావాలని, లేనిచో చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, పలు మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.