తాండూరు రూరల్, నవంబర్ 10 : జిల్లాలో 127 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని, సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 43 రైసు మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. కొనుగోలు కేంధ్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బుధవారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 2.50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యం ఉందన్నారు. 15వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. సుమారు 70 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామన్నారు. గతంలో ధాన్యం కొనుగోళ్లలో కొంతమంది అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, ఈసారి మాత్రం ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. రైతుకు ఇబ్బందులు సృష్టించేవారిపై కఠిన చర్యలుంటామని స్పష్టం చేశారు.
కర్నాటకతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని తెలిపారు. సరిహద్దుల్లో చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చెక్పోస్టుల్లో ముగ్గురు అధికారులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1960, సెకండ్ గ్రేడ్ రకం రూ.1940 ప్రభుత్వం చెలిస్తున్నదని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాలవారు కేవలం వానకాలం పంటను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. తేమ శాతం 17 లోపు ఉండాలని సూచించారు. ఎకరాకు సుమారు 23 నుంచి 36 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి కావచ్చన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నాలుగు రిజిస్టర్లు మొయింటేన్ చేయాలని సూచించారు. 500 బస్తాలు కొనుగోలు పూర్తయిన వెంటనే లారీల్లో ఆయా రైసు మిల్లులకు తరలించాలని తెలిపారు. ప్రతి రోజు కచ్చితంగా 500 బస్తాల ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ట్రక్ షీట్ విధిగా మిల్లర్లకు పంపాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్ విధిగా ఏర్పాటు చేయాలని తెలిపారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం, ఐఎఫ్ఎస్సీ కోడ్ నెంబర్తోపాటు ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తీసుకొని రావాలన్నారు. ఫోన్ నెంబరు కూడా విధిగా ఉండాలన్నారు. ఓటీపీ ద్వారానే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. రైతులు కిలో సాంపిల్ ధాన్యం తీసుకువచ్చి వ్యవసాయాధికారి నుంచి టోకెన్ పొందాలని సూచించారు. మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించరాదన్నారు. కార్యక్రమంలో డీఎస్వో రాజేశ్వర్, టెక్నికల్ ఆఫీసర్ యాదగిరి, ఓపీఎంఎస్ లక్ష్మణ్ ఉన్నారు.