హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ): ఒక్కొక్కసారి ఫ్యాన్లు, లైట్లు, టీవీలు, ఏసీలు, గీజర్లు లాంటివి ఆఫ్ చేయకుండానే ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోతుంటాం. ఇలాంటి సందర్భాల్లో కరెంట్ మీటర్ రీడింగ్ గిర్రున తిరిగి, భారీగా బిల్లు వస్తుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టే టెక్నాలజీని ఆవిష్కరించారు ఇద్దరు విద్యార్థినులు సాహిత్య, వందన. హైదరాబాద్లోని విజయ్నగర్కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొంటున్న వీరికి అదే స్కూల్ టీచర్ పడాల సురేశ్కుమార్ మార్గదర్శనం చేశారు. కెనడాలోని సీజీఐ కంపెనీకి చెందిన లెర్నింగ్ లింక్ ఫౌండేషన్ సహకారాన్ని అందించింది. ఈ ఆవిష్కరణకు ‘హై వైఫై’ అనే పేరుపెట్టారు. ఇంటికి ఎంత దూరం నుంచైనా, చివరకు విదేశాల నుంచైనా మన ఇంట్లోని విద్యుత్తు ఉపకరణాలను స్విచ్ఛాఫ్ చేయగలిగే సామర్థ్యం ఉండటం హై వైఫై ప్రత్యేకత.
అటట్ టింకరింగ్ ల్యాబ్లో అంకురార్పణ
విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను స్టార్టప్లుగా మలిచేందుకు గాను ఈ పాఠశాలకు అటల్ టింకరింగ్ ల్యాబ్ను మంజూరుచేశారు. విద్యార్థినులు ఇదే ల్యాబ్లోని పరికరాలతోనే ప్రయోగాలు చేసి, హై వైఫై ప్రాజెక్ట్ను తయారుచేశారు. ఈ ప్రాజెక్టును ఇదే ల్యాబ్తో అనుసంధానం చేసి, వినియోగిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్విచ్ల జోలికి వెళ్లకుండానే మొబైల్ ఫోన్ ఆధారంగా ఫ్యాన్లను, లైట్లను ఆర్పవచ్చని చెప్తున్నారు. ఇది రిమోట్ మాదిరిగా పనిచేస్తుందని ఆవిష్కర్తలు పేర్కొన్నారు.
హైవైఫై ప్రాజెక్టు తయారీకి కావాల్సినవి
ఇంట్లో వైఫై కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్ఫోన్, అలెక్సా యాప్, కొన్ని సాఫ్ట్వేర్లు వినియోగించి తయారుచేసిన స్విచ్ బోర్డు.
ఎలా పనిచేస్తుంది
స్మార్ట్ఫోన్లో అలెక్సా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. కొన్ని రకాల సాఫ్ట్వేర్లతో హై వైఫై బోర్డును తయారుచేయాలి. గదిలో లేదా ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లను ఈ బోర్డుతో అనుసంధానం చేయాలి. ఈ బోర్డును అలెక్సా యాప్తో అనుసంధానించాలి. అలెక్స్ యాప్ ద్వారా ఫ్యాన్లు, లైట్లను ఆన్, ఆఫ్ చేయొచ్చు.