Vijay Mallya : తనను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలువడంపై ప్రముఖ వ్యాపారవేత్త (Business Man) విజయ్ మాల్యా (Vijay Malya) మండిపడ్డారు. తాను కావాలనే బ్రిటన్ (Britain) లో ఉండిపోలేదని స్పష్టంచేశారు. బ్రిటన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రస్తుతం తనకు చట్టపరమైన అనుమతి లేదని అన్నారు. 1992 నుంచి బ్రిటన్లో శాశ్వత నివాస హక్కుతో ఉంటున్నానని మాల్యా చెప్పారు. భారత్కు రావాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తాను దేశం విడిచి వెళ్లలేనని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తన విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు.
కాగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల వ్యవహారంలో మాల్యా చాలాకాలంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. కింగ్ఫిషర్ భారీ నష్టాల్లో కూరుకుపోయి బ్యాంకుల రుణాలు చెల్లించలేకపోయిన సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్ నుంచి బ్రిటన్కు వెళ్లారు. బ్యాంకుల కన్సార్టియంకు దాదాపు రూ.9,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేసులు నమోదయ్యాయి. 2019లో ముంబై ప్రత్యేక కోర్టు ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.
మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ సర్కారు అనుమతి కోరింది. అదే ఏడాది లండన్లో ఆయన అరెస్టయ్యారు. తర్వాత బెయిల్ లభించినా బ్రిటన్ విడిచి వెళ్లకూడదన్న షరతు విధించారు. భారత్కు అప్పగించాలన్న దిగువ కోర్టు నిర్ణయాన్ని మాల్యా హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడా చుక్కెదురైంది. బ్రిటన్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కూడా లభించలేదు. అయినా ఆయన భారత్కు తిరిగి రాలేదు. అప్పగింతకు అడ్డుగా మరో గోప్యమైన న్యాయపరమైన అంశం ఉందని భారత ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇదే సమయంలో తనను బ్రిటన్ నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని మాల్యా చెబుతున్నారు. ఇటీవల బాంబే హైకోర్టులోనూ ఇదే విషయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు. భారత్కు ఎప్పుడు వస్తారో చెప్పాలని కోర్టు కోరగా.. బ్రిటన్ కోర్టుల ఆంక్షల వల్ల ఇంగ్లండ్, వేల్స్ నుంచి బయటకు వెళ్లలేమని తెలిపారు. మాల్యా పాస్పోర్టు కూడా రద్దయిందని చెప్పారు. కింగ్ఫిషర్ రుణాల విషయంలో బ్యాంకులు అసలు బకాయిల కంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే రికవరీ చేశాయని మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.