జాన్వీకపూర్ తెలుగు అరంగేట్రం గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అగ్రహీరోల సినిమాలతో ఆమె టాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నట్లు గతంలో ప్రచారం జరిగినా అవి పుకార్లుగానే మిగిలాయి. తాజాగా విజయ్దేవరకొండ చిత్రంతో జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం విజయ్దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘లైగర్’ సినిమా రూపొందుతున్నది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రానున్న ఈ చిత్రం ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా అనంతరం విజయ్ , పూరి జగన్నాథ్ కలిసి మరో చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. ‘లైగర్’ షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో విజయ్ దేవరకొండ ఈ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించనున్నట్లు చెబుతున్నారు. కథతో పాటు విజయ్ దేవరకొండకు పాన్ ఇండియన్ స్థాయిలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది.