భోపాల్ : కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు కిందపడింది. ప్లాట్ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను అక్కడే ఉన్న పలువురు వెంటనే అప్రమత్తమై వెంటనే బయటకు లాగే ప్రయత్నం చేశారు. రైలులో ఉన్న ప్రయాణికులు సైతం చైన్ లాగడంతో నిలిచిపోగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ రైల్వేస్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్.. అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
రైల్వే పీఆర్ఓ ఖేమ్ రాజ్మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా ఓ వ్యక్తి, చిన్నారితో కలిసి రైలు ఎక్కుతున్నారు. మొదట లగేజీ రైలులో పెట్టిన తర్వాత చిన్నారితో కలిసి వ్యక్తి రైలులో ఎక్కాడు. ఆ తర్వాత మహిళ కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడి ఫ్లాట్ ఫాం, రైలు మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన అక్కడే ఉన్న వారంతా రక్షించే ప్రయత్నం చేయగా.. రైలులో ఉన్న ప్రయాణికులు చైన్ లాగడంతో ట్రైన్ నిలిచిపోయింది. మహిళ సురక్షితంగా ప్రాణాలతో బయటపడిందని రాజ్మీనా తెలిపారు.