భారీ అంచనాలతో ప్రపంచకప్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్పై ఘనవిజయంతో శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్లో స్మృతి మందన, స్నేహ్ రాణా, పూజా వస్ర్తాకర్ అర్ధశతకాలతో రాణిస్తే.. బౌలింగ్లో రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి విజృంభించారు!
మౌంట్మాంగనీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో మిథాలీరాజ్ బృందం 107 పరుగుల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్ర్తాకర్ (59 బంతుల్లో 67; 8 ఫోర్లు), స్నేహ్ రాణా (48 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు), స్మృతి మంధన (52; 3 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు సాధించగా.. దీప్తి శర్మ (40) రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (9), హర్మన్ప్రీత్ కౌర్ (5), షఫాలీ వర్మ (0), రిచా ఘోష్ (1) విఫలమైనా.. మిగిలినవాళ్లు రాణించడంతో టీమ్ఇండియా మంచి స్కోరు చేయగలిగింది. పాక్ బౌలర్లలో నిదా డార్, నష్రా సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సిద్రా అమీన్ (30) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4, జులన్ గోస్వామి, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రధాన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ను నడిపించిన పూజా వస్ర్తాకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్లో గురువారం ఆతిథ్య న్యూజిలాండ్తో భారత జట్టు తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 244/7 (పూజ వస్ర్తాకర్ 67, స్నేహ్ రాణా 53*; నష్రా 2/36), పాకిస్థాన్: 43 ఓవర్లలో 137 ఆలౌట్ (సిద్రా 30; రాజేశ్వరి 4/31, జులన్ 2/26).