స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఎన్నికల అధికారుల నుంచి శుక్రవారం ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ నెల 24నే విజయం ఖరారు కాగా నిబంధనల మేరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలిరాగా ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేంద్ర, రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి కవితకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయం కార్యకర్తలతో సందడిగా మారింది. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
నిజామాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవ విజయం సొంతంచేసుకున్న కల్వకుంట్ల కవితకు అభినందనలు వెల్లువెత్తాయి. నవంబర్ 24నే కవిత విజయం ఖరారు కాగా.. శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం పరిశీలకురాలు అనితా రాజేంద్ర, రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు, ముఖ్య నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొన్నది.
ధ్రువీకరణ పత్రం అందజేత…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగిసిన వెంటనే ఈ మేరకు కవితకు సమాచారం అందజేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేంద్ర సమక్షంలో కల్వకుంట్ల కవితకు భారత ఎన్నికల సంఘం తరఫున ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన సంబురాలు
ఖలీల్వాడి నవంబర్ 26: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ పత్రం అందుకున్న సందర్భంగా ఆమె నివాసం వద్ద సందడి నెలకొన్నది. టీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని ఘనస్వాగతం పలికారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబురం వ్యక్తంచేశారు. డ్యాన్సులు, ‘జై తెలంగాణ… జై కేసీఆర్’ నినాదాలతో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం మార్మోగింది. అభిమానులు క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు.
పార్టీలకు అతీతంగా సహకరించారు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత విజయానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించారు. పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపడం అభినందనీయం. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు ప్రత్యేక అభినందనలు. అందరం కలిసి ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో రోల్ మోడల్గా తీర్దిదిద్దుతాం.
-వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి