హైదరాబాద్, మార్చి 28: హైదరాబాదీకి చెందిన సంస్థ అరబిందో ఫార్మా..ఇదే నగరానికి చెందిన మరో ఫార్మా కంపెనీ వెరిటాజ్ హెల్త్కేర్ను కొనుగోలు చేసింది. రూ.171 కోట్ల నగదు చెల్లింపుతో వెరిటాజ్ వ్యాపారాన్ని, కొన్ని ఆస్తుల్ని టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు అరబిందో సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ లావాదేవీ అమలులోకి వస్తుందని, మే నెలకల్లా పూర్తవుతుందన్నది. దేశీ మార్కెట్లో వెరిటాజ్ వివిధ బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్స్, ఇతర హెల్త్కేర్ సంబంధిత ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నది. 23 నగరాల్లో 50 వేలకుపైగా రిటైలర్లను కవర్ చేస్తూ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను కలిగి ఉంది. దేశంలో బయోసిమిలర్, తదితర ఉత్పత్తుల్ని తాము ప్రవేశపెట్టేందుకు వెరిటాజ్ టేకోవర్ సహాయపడుతుందని అరబిందో విడుదల చేసిన ప్రకటన తెలిపింది. దేశీ ఫార్ములేషన్స్ మార్కెట్లో విస్తరించాలన్న కంపెనీ లక్ష్యంలో భాగంగా ఈ లావాదేవీ జరిపామన్నది. 2021 ఆర్థిక సంవత్సరంలో వెరిటాజ్ రూ.127.02 కోట్ల టర్నోవర్ సాధించిందని, 2022 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం రూ.133.18 కోట్లకు పెరిగినట్టు అరబిందో వెల్లడించింది.