గోధుమరవ్వ, బియ్యం, పెసలు: అరకప్పు చొప్పున, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, టమాట ముక్కలు: అరకప్పు చొప్పున, స్వీట్కార్న్, పచ్చి బఠాణి: పావుకప్పు చొప్పున, నెయ్యి: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, అల్లం: అంగుళం ముక్క, పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: మూడు, జీలకర్ర: ఒక టీస్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, బిర్యాని ఆకులు, యాలకులు, లవంగాలు: రెండు చొప్పున, మిరియాలు: అర టీస్పూన్, కారం: టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, పుదీనా, కొత్తిమీర తురుము: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, కరివేపాకు: రెండు రెబ్బలు, నీళ్లు: 1.5 లీటర్లు.
గోధుమ రవ్వ, బియ్యం, పెసలను బాగా కడిగి విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. స్టవ్మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేడయ్యాక బిర్యాని ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర ఎండుమిర్చి, మిరియాలు, చిన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి.. బాగా వేగాక క్యారెట్, బీన్స్, టమాట, ఆలుగడ్డ ముక్కలు జోడించి మరో రెండు నిమిషాలు వేయించాలి. నానబెట్టిన గోధుమరవ్వ, పెసలు, బియ్యంతో పాటు స్వీట్కార్న్, పచ్చిబఠాణీ, కారం, పసుపు, ఉప్పు, పుదీనా తురుము, కరివేపాకు వేసి కలగలిపి.. లీటరున్నర నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి ఎక్కువ మంటమీద అయిదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ప్రెషర్ పోయాక మూతతీసి ఒక నిమిషం పాటు గరిటెతో బాగా కలిపి, పైనుంచి కాస్త నెయ్యి వేసుకుని కొత్తిమీర చల్లితే వెజిటబుల్ దాలియా సిద్ధం.